ప్రైవేట్ ఉద్యోగులపై… కరోనా పిడుగు

by  |
ప్రైవేట్ ఉద్యోగులపై…  కరోనా పిడుగు
X

దిశ, మహబూబ్‌నగర్: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) ఆ రంగం ఈ రంగం అని కాదు అన్ని రంగాలపైనా తన ప్రభావం చూపుతోంది. కరోనా మహమ్మారిఎఫెక్ట్‌తో ప్రైవేటు ఉద్యోగులు రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. వేతనాల మీదే ఆధారపడిన ఆ ఉద్యోగుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. నెల ప్రారంభంలో వచ్చే వేతనాల కోసం ఎదురుచూపులు మాత్రమే మిగిలాయి వారికి. ఆశలు అడియాసలయ్యాయి. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, ఇతర ఖర్చులు ఎలా చెల్లించాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.

ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన దగ్గరి నుంచి మొత్తం వ్యాపారాలతోపాటు పాఠశాలలు, కళాశాలలు, వివిధ ప్రైవేటు రంగం సంస్థలూ మూతపడిన విషయం విదితమే. మార్చి 23వ తేది నుంచి లాక్ డౌన్ కారణంగా ఎవరూ బయటకు వెళ్లే పరిస్థితి లేదు. చాలా మంది ఉద్యోగులు నెలసరివేతనాలపై ఆధారపడే జీవిస్తారు. వారు నెల ఆరంభంలో వేతనాల‌పై ఆశలు పెట్టుకుంటే వారి ఆశలు అడియాసలు అయ్యాయి. మార్చి నెల వేతనాలు అందలేదు. ఇప్పటికే ఏప్రిల్ నెల ప్రారంభం అయ్యి సగం రోజులు గడిచినా చాలా మందికి రావాల్సిన వేతనాలు అందకపోవడంతో వారు అనేక అవస్థలు పడాల్సి వస్తోంది.

ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి సంబంధిత యాజమాన్యాలు పూర్తి వేతనాలు అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ అది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. చాలా వరకు పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులకు పనిచేసిన రోజులకే వేతనాలు అందాయని తెలుస్తోంది. అదే సమయంలో
కొంతమందికి ఇప్పట్లో జీతాలు చెల్లించలేమని తిరిగి పాఠశాలలు తెరిచిన తర్వాతే వేతనాలు ఇస్తామని సంబంధిత యాజమాన్యాలు చెబుతున్నారని మరికొంత మంది ఉద్యోగులు చెబుతున్నారు. లాక్ డౌన్ ప్రకటించడంతో చాలావరకు పాఠశాలల్లో విద్యార్థులు ఫీజులు చెల్లించలేదని దీంతో తాము కూడా
వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదని చెబుతూ పిల్లల ఫీజులకు ఉపాధ్యాయుల ఫీజులకు లింకులు పెడుతున్నారు. చిరు వ్యాపార సంస్థల్లో పనిచేసే వారిని ఏకంగా ఆయా షాపుల యజమానులు మీకు వేతనాలు ఇవ్వలేమని ఇక మీదట ఉద్యోగంలో కూడా పెట్టుకునే పరిస్థితి లేదని కావున లాక్ డౌన్ ఎత్తిన
తర్వాత వచ్చి వేతనాలు తీసుకోవాలని కచ్చితంగా చెబుతున్నారు.

ప్రభుత్వమే ఉద్యోగుల వేతనాల్లో కోతలు పెట్టిందనీ అలాంటిపుడు తాము వేతనాల్లో కోతలు పెట్టడం, లేక వాయిదాలు వేయడం పెద్ద విషయమేమి కాదనే రీతిలో సంబంధిత యాజమాన్యాలు సమాధానాలు ఇస్తున్నారని చిరు ఉద్యోగులు వాపోతున్నారు. తమకు వేతనాలు ఎప్పుడు అందుతాయో తెలియడం
లేదనీ, లాక్ డౌన్ తర్వాత ఉద్యోగాలు ఉంటాయో లేదో కూడా తెలియనిస్థితిలో ఉన్నామని ప్రైవేట్ రంగ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అద్దెలు చెల్లించకపోవడంతో ఇంటి ఓనర్ల ఒత్తిడితోపాటు నెలవారీ ఖర్చులు, ఇంట్లో నిండుకున్న సరుకులు, రోజువారీ ఖర్చుల కోసం ఇతరులను చేయిచాచాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెందుతున్నారు. కరోనా మహమ్మారి సగటు మనిషి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Tags: covid 19 effect, lockdown, private sector, salaries, stopped



Next Story