నేడే కొవిడ్​ వ్యాక్సినేషన్ డ్రైవ్

by  |
నేడే కొవిడ్​ వ్యాక్సినేషన్ డ్రైవ్
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: కొవిడ్​ వ్యాక్సిన్​ను తీసుకోవడానికి ప్రజలను సన్నద్ధం చేయడానికి యంత్రాంగం శుక్రవారం ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా డ్రై రన్ నిర్వహించడానికి నిర్ణయించింది. ఇప్పటికే మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో రెండు కేంద్రాలు, ముసాపేట పీహెచ్సీలో సెంటర్​లో డ్రై రన్​ విజయవంతం చేసిన అధికారులు ఇప్పుడు మరిన్ని కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 97 కేంద్రాల్లో డ్రై రన్ ను నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు.

జిల్లాల వారీగా కేంద్రాల వివరాలు :

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 97 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో 27 కేంద్రాలు, నాగర్​ కర్నూల్​లో 32, నారాయణపేట లో 12, గద్వాలలో 10, వనపర్తి లో 16 కేంద్రాల్లో డ్రై రన్ నిర్వహించనున్నారు. అందుకోసం గురువారం సాయంత్రానికి ఎంపిక చేసిన కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు.

సిబ్బందికి అవగాహన..

కొవిడ్​ డ్రై రన్ సందర్భంగా ఆయా ఆస్పత్రుల్లో ఎంపిక చేసిన సిబ్బందికి అవగాహన కల్పించారు. వ్యాక్సినేషన్ కోసం వచ్చే వారి వివరాలను సేకరించడం, వాటిని ఆన్​లైన్​లో నమోదు చేయడం, వ్యాక్సిన్ ఇవ్వడం, వ్యాక్సిన్ తీసుకున్న వారు అరగంట సిబ్బంది పరిశీలనలో ఉంచడం వంటి అంశాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ప్రతీ కేంద్రంలోనూ 25 మంది సిబ్బంది శుక్రవారం డ్రై రన్​లో భాగస్వాములు అయ్యేలా శిక్షణ పొందారు.

ఏర్పాట్లపై కలెక్టర్ల పరిశీలన..

నేడు నిర్వహించనున్న కొవిడ్​ డ్రై రన్​ ఏర్పాట్లకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు గురువారం పరిశీలించారు. ప్రతి కేంద్రంలోనూ నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని, అవసరమైన ఏర్పాట్లలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని కలెక్టర్లు సంబంధిత వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ఏర్పాట్లపై వారు ఆకస్మికంగా తనిఖీలు కూడా నిర్వహించారు.

ఇలా చేస్తారు..

వ్యాక్సిన్​ ను ప్రత్యేక వాహనంలో కేంద్రాలకు నిర్ణీత సమయానికి ముందే తీసుకువచ్చి భద్రపరుస్తారు. ఎంపిక చేసిన సిబ్బంది తమ పేర్లు నమోదు చేసుకొని గది లోకి వెళ్తారు. అక్కడ వారి పేర్లను ఆధార్ తదితర గుర్తింపు కార్డులతో నమోదు చేసుకుంటారు. ఆన్ లైన్ లో నమోదైన వారికి ఓటీపీ వస్తుంది. అలా వచ్చిన వారు వ్యాక్సిన్​ తీసుకోవడానికి పేర్లు నమోదు చేసుకున్నారని గుర్తిస్తారు. నమోదు చేసుకున్న వారిని అందరిని ఒక గదిలో నిబంధనల ప్రకారం కూర్చోబెట్టి, పేర్లు నమోదు చేసుకున్న వారి నంబర్ రాగానే మరో గదిలోకి తీసుకెళ్తారు. మౌఖికంగా మరోసారి వారి వివరాలను అడిగి తెలుసుకొని వ్యాక్సినేషన్ చేస్తారు. ఆ తర్వాత అరగంట సేపు మరో గదిలో ఉంచి ఏమైనా సమస్యలు తలెత్తితే విరుగుడు మందులు ఇచ్చి ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారు. కాగా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంది.



Next Story

Most Viewed