కరోనా ఎఫెక్ట్..ఎండుతున్న గొంతులు

by  |
కరోనా ఎఫెక్ట్..ఎండుతున్న గొంతులు
X

దిశ,న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ (కోవిడ్ -19) మహమ్మారి కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో అసంఘటిత కార్మికులు అతలాకుతలమవుతున్నారు. లాక్‌డౌన్‌తో సిటీ మొత్తం ఎక్కడిక్కడా స్థంభించి పోయింది. అసంఘటిత కార్మికులకు తినడానికి తిండి, తాగడానికి గుక్కెడు నీళ్లు దొరికే పరిస్థితి లేదు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

చలివేంద్రాలు లేవు..

సాధారణంగా ఎండాకాలం ప్రారంభంలోనే సిటీ మొత్తం ప్రధాన సెంటర్లలో కొందరు దాతలు, స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తాయి. తద్వారా అసంఘటిత రంగ కార్మికులు, బాటసారుల దాహార్తి తీరేది. కాని ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ లాక్ డౌన్ సందర్భంగా ఎక్కడా చలివేంద్రాలు లేవు. కొన్ని చోట్ల ఏర్పాటు చేసినా వాటిని పోలీసులు మాసివేయించారు. పైగా ఇప్పుడు సిటీలో ఎవరి తలుపు తట్టినా గ్లాస్ తాగు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో అసంఘటిత రంగ కార్మికులు ఆపసోపాలు పడుతున్నారు. ఇంటికి పోదామంటే రవాణా సౌకర్యం లేక, నగరంలో దిక్కుమొక్కు లేక కాలం వెల్లదీస్తున్నారు.
55 ఏండ్లున్న ఓ అసంఘటిత రంగ కార్మికుడిని లాక్‌డౌన్‌తో పని నుంచి యజమాని తీసేశాడు. దాంతో ఆయన ఎక్కడికి పోవాలో తెలియక..తినడానికి తిండిలేక.. గాంధీ భవన్ ప్రాంతంలో తిరుగుతున్నాడు. ఎవరైనా అన్నదానం చేస్తే అక్కడ తిని పూట గడుపుతున్నాడు. ఆ ప్రాంతంలో తాగడానికి తాగునీళ్లు లేక గొంతు ఎండిపోతుండటంతో..మున్సిపాలిటీ ట్యాంకర్ నీళ్లు తాగుతున్నాడు. ఈ దృశ్యం చూస్తే..హైదరాబాద్‌లో తాగు నీటికి కార్మికులు ఇబ్బందులు అర్థమవుతుందని చెప్పొచ్చు. లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ సిటీలోని ప్రధాన సెంటర్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే అసంఘటిత రంగ కార్మికులకు, బాటసారులు, పోలీసులు, ఇతరుల దాహార్తి తీరుతుందనీ, అయితే, అక్కడ కూడా పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చేలా చూడాలని, అందుకు తగు చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Tags: Lockdown, no water facility, unorganized labor,Municipality Tanker


Next Story

Most Viewed