పెండ్లి తర్వాత బతకలేమని.. పురుగుల మందు తాగిన ప్రేమ జంట

by  |
poison
X

దిశ, ఏపీ బ్యూరో: ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబాలు పెళ్లికి నిరాకరించాయి. ఎలాగూ కలిసి బతకలేమని కనీసం చావులోనైనా కలిసిపోవాలని ఆ జంట నిర్ణయించింది. అంతే పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లా దాచేపల్లిలో చోటు చేసుకుంది. దాచేపల్లి నడికుడికి చెందిన ఓ యువకుడు గురజాల మండలం అంబాపురంకు చెందిన ఓ యువతి ఇద్దరూ ప్రేమించుకున్నారు. కాలేజీలో చదువుకునే రోజుల నుంచి ఇద్దరూ ప్రేమించుకున్నారు.

ఇక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపగా వారు అంగీకరించలేదు. కులాలు వేరు కావడంతో పెళ్లికి ఒప్పుకునేది లేదని తెగేసి చెప్పారు. దీంతో శనివారం ఆ ప్రేమ జంట దాచేపల్లి మండలంలోని బట్రుపాలెంలో కలుసుకున్నారు. అంతకుముందే ఓ గుడిలో పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిస్తే బతకనివ్వరని తీవ్ర ఆవేదనకు గురయ్యారు. దీంతో మనస్తాపం చెంది ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. అయితే స్థానికులు ఈ విషయాన్ని గమనించడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.


Next Story