ఒక్క రోజులో 28,701 పాజిటివ్‌లు

by  |
ఒక్క రోజులో 28,701 పాజిటివ్‌లు
X

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా మహమ్మారి మరింత ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతోంది. సోమవారం ఉదయం కేంద్ర ఆరోగ్యశాఖ బులెటిన్ వెల్లడించే సరికి గడిచిన 24గంటల్లో దేశంలో 28,701 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా వైరస్ ప్రవేశించినప్పటి నుంచి రోజువారి నమోదైన కేసుల గరిష్ట సంఖ్య ఇదే కావడం గమనార్హం. కొత్త కేసులతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 8,78,254కి చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. వైరస్ బారిన పడి దేశంలో ఒక్కరోజే 500 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 23,174కు చేరింది. కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 5,53,471 మంది కోలుకోగా ప్రస్తుతం 3,01,609 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలలో కరోనా వ్యాప్తి రోజురోజుకు తీవ్రమవుతోంది. ఢిల్లీలో ఒక్కరోజే 1,246 కొత్త కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 1,13,740కు చేరింది. ఇక్కడ కొత్తగా 40కరోనా మరణాలు నమోదవడంతో మొత్తం 3,411 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. మహారాష్ట్రలో ఒక్కరోజులోనే 6497 పాజిటివ్ కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 2,60,924కి వెళ్లింది. 24 గంటల్లో వైరస్ బారినపడి 193 మంది చనిపోగా మొత్తం మరణాలు 10,482కి చేరాయి. తమిళనాడులో 24గంటల్లో 4,328పాజిటివ్‌లు నమోదై మొత్తం కేసుల సంఖ్య 1,42,798కి చేరింది. ఇక్కడ కొత్తగా కరోనాతో 66 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 2,032కి చేరింది. గుజరాత్‌లో ఇప్పటివరకు ఉన్న 42,808 కేసులకు గాను 2057 మంది మరణించడం కలవరం కలిగిస్తోంది. ఏపీలో గడిచిన 24గంటల్లో 1,935కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 31,103కి చేరింది. ఒక్కరోజే 37 మంది చనిపోయారు. ఇప్పటివరకు వైరస్ సోకి 365 మంది మృత్యువాత పడ్డారు.

Next Story