కాసులు కురిపిస్తున్న‘పట్టణ ప్రగతి’!

by  |
కాసులు కురిపిస్తున్న‘పట్టణ ప్రగతి’!
X

దిశ, వరంగల్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కొంతమంది కౌన్సిలర్లకు కాసులు కురిపిస్తోంది. పరిశుభ్రత పేరిట ఖాళీ స్థలాల్లో చెత్తా చెదారం ఎత్తివేసే క్రమంలో వారు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సంబంధిత ప్లాట్ల యాజమానుల దగ్గర నుంచి ముక్కు పిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నట్టు సమాచారం. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు మరీ అతిగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పుణ్యానికి ఓట్లేశారా..? డబ్బులు తీసుకోలేదా..? అలాంటప్పుడు ఉచితంగా ఎందుకు సర్వీస్ చేయాలని బహిరంగంగా పేర్కొంటున్నట్టు సమాచారం. మీ ప్లాటే కదా శుభ్రం చేసేది.. అందుకు ఖర్చులు భరించాల్సిందేనని సంబంధిత యాజమానులతో ఖరాకండిగా చెబుతున్నట్లు తెలుస్తోంది. డబ్బులు ఇవ్వకుంటే మీ ప్లాటు కబ్జా అయిపోతుందని పరోక్షంగా బెదిరింపులకు దిగుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

శుభ్రత పేరిట వసూళ్లు..?

టీఆర్ఎస్ సర్కార్ పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టింది. ప్రజా ప్రతినిధులు ఆయా వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలను చైతన్యం చేసే బాధ్యతను తీసుకున్నారు. కొద్దిరోజుల కిందట పురపాలక మంత్రి కేటీఆర్ జనగామ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు వార్డులు అపరిశుభ్రంగా ఉండటంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాకుండా ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరిగి ఉండటం, ఆ ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా చెత్తా చెదారం వేయడాన్ని తప్పు బట్టారు. వెంటనే ఖాళీ స్థలాల యాజమానులకు నోటీసులు జారీ చేసి పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇక ఆ మరుసటి రోజు నుంచి మున్సిపల్ అధికారులు ఖాళీ స్థలాల యాజమానుల అడ్రస్‌లు దొరకబట్టి నోటీసులు జారీ చేసే పనిలో పడ్డారు. రోడ్డపై అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కొంతమంది ప్లాట్ల యాజమానులు సంబంధిత వార్డు కౌన్సిలర్లకు ఫోన్ చేసి తమ ప్రాంత సమస్యలు విన్నవించారు. దీనికి వెంటనే స్పందించిన కొంతమంది కౌన్సిలర్లు సంబంధిత పనులు పూర్తి చేయించారు. కానీ, కొంతమంది కౌన్సిలర్లు మాత్రం పని పూర్తయ్యాక యాజమానికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసినట్టు సమాచారం. జనగామ పట్టణంలోని హైదరాబాద్ రోడ్‌లోని మూడో వార్డుకు సంబంధించి ఓ డాక్టర్, వ్యాపారికి స్థానిక కౌన్సిలర్ నుంచి చేదు అనుభవం ఎదురైనట్టు సమాచారం. నేరుగా కౌన్సిలర్ ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయడంతో వారు ఇవ్వక తప్పలేదని ప్రచారంలో ఉంది.

ఎక్కడ చెత్త అక్కడే..

పట్టణ ప్రగతిలో భాగంగా వారం రోజులు హడావిడి చేసిన ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆ తర్వాత అంతా షరా మామూలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది కూడా నెమ్మదించారు. బుధవారం మరిపెడ మున్సిపాలిటీ సిబ్బంది వేతనాలు చెల్లించడం లేదంటూ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ వేసిన చెత్త అక్కడే అన్నట్లుగా పేరుకుపోయింది. కొన్నిచోట్ల ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు దర్శనమిస్తూనే ఉన్నాయి. మరికొన్ని చోట్ల మోరీలు కంపు కొడుతున్నాయి. దీనిపై కౌన్సిలర్లకు ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

tags : pattana pragathi, minister ktr, counsellors, warangal

Advertisement
Next Story

Most Viewed