ఉనికి కోసమే సీఎంపై అవాకులు చవాకులు :గుత్తా

by  |
ఉనికి కోసమే సీఎంపై అవాకులు చవాకులు :గుత్తా
X

దిశ, నల్లగొండ: కృష్ణా పరివాహకంలో మెట్ట ప్రాంతాలకు నీరందించి సస్యశ్యామలం చేసేలా.. 13 లిఫ్ట్‌లకు రూ.3వేల కోట్లను మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సోమవారం ఉదయం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు, నిధులు మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. ప్రతి ఎకరానికి నీళ్లందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని వెల్లడించారు.

పంజాబ్ రాష్ట్రం తర్వాత అధిక పంటలు పండించిన ఘనత తెలంగాణ సాధించిందని గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఒక మనిషి తలసరి ఆదాయం రూ.2.25 లక్షలు పెరిగిందన్నారు. ప్రతిపక్షాలు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో ప్రతి ఒక్కరూ గమనించాలని సూచించారు. ప్రతిపక్ష నేతలు ఉనికి కోసమే సీఎం కేసీఆర్‌పై అవాకులు, చవాకులు పేల్చుతున్నారని మండిపడ్డారు. ఆదివారం మట్టంపల్లిలో బీజేపీ నేతలు పోలీసులపై చేసిన దాడిని ఖండిస్తున్నానని.. దాడులతో ఏం సాధించలేరని గుత్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Next Story