ఎమ్మార్వో ఆఫీసులో అవినీతి.. ఆకాశరామన్న ఉత్తరాలు

by  |
Nelakondapalli Tehsildar
X

దిశ, పాలేరు: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి తహశీల్దార్ కార్యాలయంలో అధికారుల అవినీతికి పాల్పడ్డారంటూ ఇటీవల ఆకాశరామన్న ఉత్తరాలు వెలువడ్డాయి. ఈ విషయమై నేలకొండపల్లి తహసీల్దార్ సుమ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆఫీసులో కార్యకలాపాలన్నీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతున్నాయని కార్యాలయంలో ఎలాంటి అవినీతికి తావు లేదన్నారు. తహసీల్దార్ కార్యాలయంపై అవినీతి ఆరోపణలతో వెలువడిన ఆకాశరామన్న ఉత్తరాలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మండల ప్రజలు, రైతులు కార్యాలయ కార్యకలాపాలపై ఎలాంటి ఇబ్బందులు ఉన్న నేరుగా తనను సంప్రదిస్తే, సమస్యను పరిష్కరిస్తామన్నారు.

రెవెన్యూ కార్యకలాపాల విషయంలో ఎవరూ లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని, రెవెన్యూ సిబ్బంది ఎవరైనా లంచం కోసం ఇబ్బందులకు గురి చేస్తే నేరుగా తనకు ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యాలయంలో అంతర్గత విభేదాలు లేవు, సిబ్బంది అందరూ సమన్వయంతో పని చేస్తున్నారన్నారు. మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యకలాపాలు నిర్వహించేందుకు ముందుటామని, మండల ప్రజలు, రైతులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.a



Next Story