మక్కలకు ధర.. కావాలి జర!

by  |
మక్కలకు ధర.. కావాలి జర!
X

దిశ‌, ఖ‌మ్మం: ముందు ఊరించిన మ‌క్క‌ల ధ‌ర రోజురోజుకూ ప‌డిపోతూ రైతాంగాన్ని క‌ల‌వ‌ర‌పెడుతోంది. స‌మీప‌ భ‌విష్య‌త్‌లో ఈ ధ‌ర కూడా ఉండ‌ద‌ని వ్యాపారులు హెచ్చ‌రిస్తుండ‌టంతో రైతులు ఆరుగాలం పండించిన పంట‌ను అగ్గువ‌స‌గ్గువ‌కు అమ్ముకుంటున్నారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో చికెన్ ప్రియులు దూరంగా ఉండ‌టంతో పౌల్ట్రీరంగానికి కోలుకోలేని విధంగా దెబ్బ త‌గిలింది. కోళ్ల పెంప‌కానికి పౌల్ట్రీ రైతులు ఇప్ప‌ట్లో సాహ‌సించే ప‌రిస్థితి క‌న‌బ‌డ‌టం లేద‌ని ఆ రంగంలో సుదీర్ఘ‌కాలంగా కొన‌సాగుతున్న వారు చెబుతున్నారు. దీంతో కోళ్ల‌కు ప్ర‌ధాన దాణాగా వినియోగించే మ‌క్క‌ల కొనుగోళ్ల‌పై ఈ ప్ర‌భావం ప‌డుతోంది. మ‌క్క‌లకు డిమాండ్‌కు త‌గ్గ‌డంతో వ్యాపారులు కూడా కొనుగోళ్ల‌కు ముందుకు రావ‌డం లేదు. వ‌చ్చినవారు క‌నిష్ఠ స్థాయి ధ‌ర‌ల‌తో కొనుగోలు చేస్తున్నారు. గ‌తేడాది క్వింటాకు రూ.2100 వ‌ర‌కు అమ్ముడుపోయిన మ‌క్క‌ల‌ను ఖ‌మ్మం మార్కెట్లో సోమ‌వారం క్వింటాకు రూ.1400లు జెండా పాట‌గా నిర్ణయించగా స‌గ‌టు ధ‌ర 1350 ప‌లికింది. దీంతో మ‌క్క‌ల రైతుల మొహ‌ల్లో నెత్తురు చుక్క ఉండ‌టం లేదు.

పెరిగిన సాగు విస్తీర్ణం

గ‌తేడాది ధ‌ర బాగుండ‌టంతో ఈ ఏడాది ముంద‌స్తుగానే ప‌త్తి పంట‌ల‌ను తీసేసి మొక్కజొన్న పంట‌ల‌ను వేశారు. దిగుబ‌డి కూడా అధికంగా వ‌స్తోంది. ఈ ఏడాది ఖ‌మ్మం జిల్లాలో 12,228 హెక్టార్లు (30,570ఎకరాలు) మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం కాగా 34,611 హెక్టార్లు (86,527ఎకరాలు)ల్లో మొక్కజొన్న సాగుచేశారు. ఖమ్మం డివిజన్‌లో సాధారణ విస్తీర్ణం 592 హెక్టార్లకు 1,090 హెక్టార్లలో రైతులు సేద్యం చేశారు. కూసుమంచి డివిజన్‌లో 2,559 హెక్టార్లలో, మధిర డివిజన్‌లో 19,818, సత్తుపల్లి డివిజన్‌లో 1,653హెక్టార్లలో సాగుచేశారు. వైరా డివిజన్‌లో 9,491హెక్టార్లలో సాగుచేశారు. దాదాపు 30 ల‌క్ష‌ల క్వింటాళ్ల మొక్కజొన్న దిగుబడి వచ్చే అవకాశముంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

మార్క్‌ఫెడ్‌ కొనుగోళ్ల కోసం రైతుల ఎదురుచూపు

మార్కెటింగ్ శాఖ మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేప‌డితే క‌నీస మ‌ద్దతు ధ‌ర ద‌క్కుతుంద‌ని రైతులు ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. గతేడాది మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో క్వింటా మొక్కజొన్నకు రూ.1,760 మద్దతు ధర చెల్లించారు. అయితే బహిరంగ మార్కెట్లో రూ.2 వేల వరకు మ‌క్క‌లు అమ్మ‌కం జ‌ర‌గ‌డంతో మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలకు ఆద‌ర‌ణ లేక నామ‌మాత్రంగా న‌డిచాయి. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితిలో ప్ర‌భుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేప‌డితే కొద్దిగా అయినా మెరుగ‌వుతుంద‌ని రైతులు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.

Tags: Khammam Market, Falling Corona, Corona Virus, Farmers, Cotton, Poultry, Chicken, Markfed


Next Story

Most Viewed