Corona Virus : మళ్ళీ పంజా విసురుతున్న కరోనా.. ఈసారి ఏం జరగబోతోంది?

by Muthe.Rajitha |

2025లో కరోనా వైరస్(Corona Virus) మళ్లీ తన పంజా విసురుతూ ప్రపంచాన్ని తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Corona Virus : మళ్ళీ పంజా విసురుతున్న కరోనా.. ఈసారి ఏం జరగబోతోంది?
X

దిశ, వెబ్ డెస్క్ : 2025లో కరోనా వైరస్(Corona Virus) మళ్లీ తన పంజా విసురుతూ ప్రపంచాన్ని తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. హాంకాంగ్(Hong Kong), సింగపూర్‌(Singapore)లో కేసులు వేగంగా పెరుగుతుండటంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. హాంకాంగ్‌లో ఒక్క మే మొదటి వారంలోనే వేల సంఖ్యలో కేసులు నమోదవగా.. వీరిలో నెలల వయసున్న చిన్నారులతో సహా చాలా మందికి వైరస్ సోకింది. సింగపూర్‌లో ఈ వారంలోనే 14,200 కేసులు నమోదు కాగా.. గత కొన్ని నెలలతో పోలిస్తే ఇది భారీ పెరుగుదలను సూచిస్తుంది.

ఈ ప్రాంతాల్లో కరోనాతో పాటు అడినోవైరస్, రైనోవైరస్ వంటి శ్వాసకోశ వైరస్‌లు కూడా వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కలిగించే విషయంగా మారింది. దీంతో మరోసారి మాస్క్‌లను ధరించడం తప్పనిసరి చేయడం తదితర కరోనా జాగ్రత్తలు తీసుకోవడం మొదలైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రకారం జనవరి-ఫిబ్రవరిలో కేసులు 16% తగ్గినప్పటికీ.. XEC, LP.8.1 వంటి కొత్త సబ్‌వేరియంట్‌లు వేగంగా వ్యాప్తి చెందుతూ కొన్ని ప్రాంతాల్లో కేసుల సంఖ్యను భారీగా పెరుగుతున్నాయి.

ఈ వేరియంట్‌లు గత వాటి కంటే తొందరగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ.. తీవ్రమైన అనారోగ్యం కలిగించే సామర్థ్యం తక్కువని నిపుణులు చెబుతున్నారు. అయితే వ్యాక్సినేషన్ రేటు తగ్గడం, రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల ఈ కేసులు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈసారి కరోనా లక్షణాలు గతంతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. వాసన, రుచి కోల్పోవడం తగ్గి, జలుబు, సీజనల్ అలర్జీలా తేలికపాటి లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నప్పటీ.. 75 ఏళ్లు పైబడినవారు, రోగనిరోధక శక్తి తక్కువవారు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తీవ్ర ప్రమాదంలో పడనున్నారు.

వీరు మళ్ళీ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఇండియాలో 2025 మార్చి నాటికి కేసులు ఐదు నెలల గరిష్ట స్థాయికి చేరాయి. మహారాష్ట్రలో ఎరిస్ అనే ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ కేసులు నమోదై ఆస్పత్రులు మళ్ళీ కోవిడ్ వార్డులను తెరుస్తున్నారు. అయినప్పటికీ 1.7 బిలియన్ డోసుల వ్యాక్సినేషన్ వల్ల ఇండియాలో పరిస్థితి నియంత్రణలో ఉంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రద్దీ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం, తాజా వ్యాక్సిన్ తీసుకోవడం, చేతులు కడుక్కోవడం, అనారోగ్యం ఉంటే ఇంట్లో ఉండడం, తీవ్ర లక్షణాలుంటే డాక్టర్‌ను సంప్రదించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచిస్తోంది.

నిపుణులు కరోనా ఇప్పుడు ఎండమిక్‌గా (సీజనల్ వ్యాధిలా) మారిందని, జలుబు, ఫ్లూ లాగా నియంత్రించదగినదని చెబుతున్నారు. గత కోవిడ్ అనుభవం నుంచి నేర్చుకున్న పాఠాలతో ప్రపంచం కరోనాను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉంది. సరైన జాగ్రత్తలతో ఈ వేవ్ ను కూడా నియంత్రించవచ్చు.

Next Story