జాగ్రత్త పడండి: కరోనా మళ్లీ విజృంభిస్తోంది

by  |
Corona virus
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: కరోనా మరోసారి విజృంభిస్తోంది. కొవిడ్ కేసులు రోజురోజుకు రెట్టింపవుతున్నాయి. ప్రాణాంతక వైరస్‌కు జనం మాత్రం జంకడం లేదు. జాగ్రత్తలు పాటించాలన్నా.. హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. జన సంచారం అధికంగా ఉండే ప్రదేశాల్లోనూ.. ప్రయాణ సమయాల్లో కొవిడ్ నిబంధనలు పాటించడం లేదు. మెజారిటీ ప్రజలు కనీసం మాస్కులు ధరించడం మానేశారు. భౌతిక దూరం పాటించడం లేదు. ఇకపోతే శానిటైజర్ కు ఏప్పుడో టాటా చెప్పేశారు. ప్రజల్లో నిర్లక్ష్యం పెరగడంతో మళ్లీ కరోనాకు ఊపిరిచ్చినట్లైంది. దీంతో జిల్లాలో కొన్ని రోజులుగా పాజిటీవ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి.

మళ్లీ పడగ విప్పుతోంది..

జిల్లాలో ఏడాది క్రితం కొవిడ్ పంజా విసిరింది. వేల సంఖ్యలో జనం కరోనా భారిన పడ్డారు. వందల సంఖ్యలో మృతి చెందారు. కొవిడ్‌తో మరణిస్తే.. కుటుంబసభ్యులు వారి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేని దుస్థితి నెలకొంది. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం లాక్ డౌన్ విధించడంతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా దరిచేరకుండా అనేక శ్రద్ధలు తీసుకున్నారు. దీంతో కరోనా క్రమేణా అదుపులోకి వచ్చింది. అయితే ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారాయి. కొవిడ్ నిబంధనలను పాటించకుండా జిల్లావాసులు యధావిధిగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. మళ్లీ కరోనా పడగ విప్పుతున్నా.. ప్రజలు ఈజీగా తీసుకుంటున్నారు. సినిమా హాళ్లు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, చివరికి వాకింగ్ ట్రాక్‌ల్లో కూడా గుంపులుగా సంచరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో కరోనా మళ్లీ విలాయతాండవం చేస్తోంది. మంగళవారం నాగోల్ బండ్లగూడలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్సీయల్ స్కూల్ లో దాదాపు 38మంది విద్యార్థినులకు కరోనా సోకడంతో జిల్లావాసుల్లో వణుకు మొదలైంది.

లైట్ తీసుకుంటున్న జనం..

కరోనా మూలాలు ఇంక పోలేదు.. అక్కడక్కడ వీలైనప్పుడల్లా తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. ప్రజలు మాత్రం పూర్తిగా మరిచిపోయారు. రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లు, బస్టాండ్, విద్యాసంస్థల్లో కరోనా నిబంధనలను పాటించడం లేదు. ఆర్టీసీ బస్టాండ్‌లో శానిటైజ్ చేయకుండానే బస్సులు ఎక్కేస్తున్నారు. రోడ్డుపైకి వస్తున్నా.. విద్యావంతులు సైతం మాస్కులు, శానిటైజర్లు, భౌతిక దూరం పాటించడం లేదు. ఇక కళాశాలలకు వెళ్లే విద్యార్థులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కరోనా వదిలి పోలేదని, అత్యంత తీవ్రంగా ఉందని, ఒకవేళ కరోనా టీకా తీసుకున్నా.. మాస్కులు, భౌతిక దూరం, శానిటైజర్ల వాడకం తప్పనిసరని వైద్యులు హెచ్చరిస్తున్నా అలకించడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లోకి మాస్కులు ధరించకుండానే వస్తున్నారు. గతంలో వైరస్‌పై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, దాని నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకునే అధికారులు సైతం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో మాస్కులు ధరించకున్నా.. నిబంధనలు పాటించుకున్నా జరినామాలు విధించే అధికార యంత్రాంగం పూర్తిగా గాలికోదిలేసింది.

సెకండ్ వేవ్ డేంజర్..

సెకండ్ స్ట్రెయిన్ కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గతంలో కరోనా లక్షణాలు కనిపించేవి.. పరీక్షలు చేయించుకుని చికిత్సలు పొందే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం స్ట్రెయిన్ కరోనా వ్యాప్తి చెందుతున్నా ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదని వైద్యులు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. సెకండ్ వేవ్‌లో రూపం మార్చుకున్న కరోనా స్ట్రెయిన్‌తో జాగ్రత్తగా ఉండాలంటున్నారు. జిల్లాలో మంగళవారం 3వేల మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 127కేసులు వెలుగు చూశాయి. గతంలో కరోనా వచ్చినా వారిలో 90శాతం లక్షణాలు కనిపించేవి. కానీ ప్రస్తుతం లక్షణాలు లేకుండానే కరోనా చుట్టు ముట్టేస్తోంది.

జాగ్రత్తలు పాటించాలి..

కరోనా మహమ్మారిని అరికట్టాలంటే కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలి. శానిటైజర్లను వినియోగించాలి. నిర్లక్ష్యం వహిస్తే కరోనా ప్రమాదకరంగా మారే ప్రభావం ఉంది. కరోనా టీకా వేసుకున్నా.. కరోనా నిబంధనలను పాటించాల్సిందే.. టీకా వేసుకున్నాం.. కాదా.. మనకేమి కాదునుకుంటే పొరపాటే.. టీకా వేసుకున్నా.. కరోనా సోకే ప్రమాదం ఉంది. జిల్లాలో టెస్టుల సంఖ్యను పెంచాం.. వైరస్ ప్రభలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – డాక్టర్ మల్లీకార్జునరావు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి



Next Story

Most Viewed