16 నుంచి టీకా.. వారికే తొలి ప్రాధాన్యం

by  |
16 నుంచి టీకా.. వారికే తొలి ప్రాధాన్యం
X

‘‘కరోనాపై పోరులో ఈ నెల 16న భారత్ కీలక ముందడుగు వేయనుంది. ఆ రోజు నుంచి దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు మొదలు ఫ్రంట్‌లైన్ వర్కర్లకు తొలి ప్రాధాన్యం ఉంటుంది’’ ఉన్నతస్థాయి సమావేశం అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానేవచ్చింది. ఏడాది నుంచి ఆశగా వేచి ఉన్న ప్రజలకు టీకా వేసేందుకు తేదీ ఖరారైంది. ఈ నెల 16 నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం అధికారులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో డేట్‌ను ఫిక్స్ చేశారు. మకర సంక్రాంతి, పొంగల్, లోహ్రి, ఇతర పండుగలు వస్తున్న తరుణంలో వేడుకల తర్వాతే టీకా పంపిణీ ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రాధాన్యవర్గాలను గుర్తించి ముందుగా వారికే టీకా వేయనున్నారు. తొలి విడతలో భాగంగా 30 కోట్ల మందికి టీకా అందుతుంది.

న్యూఢిల్లీ: కోటి మంది వైద్య సిబ్బంది, రెండు కోట్ల మంది పోలీసులు, పారిశుధ్య కార్మికులు, ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్లు తొలుత వ్యాక్సిన్ పొందనున్నారు. 50 ఏళ్లు పైబడిన వయోధికులు, 50 ఏళ్ల లోపు ఉండి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు సుమారు 27 కోట్ల మందికి టీకా వేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. టీకా పంపిణీ ప్రక్రియలో కొ-విన్ అప్లికేషన్ కీలకపాత్ర పోషించనుంది. లబ్ధిదారుల వివరాల నమోదు, వారికి టీకా వేసే తేదీ, వేదిక, రెండో డోసు వివరాలు లబ్ధిదారులకు మెసేజీ రూపంలో తెలియజేయడం మొదలు టీకా స్టోరేజీ వివరాలు, రాష్ట్ర, జిల్లా, గ్రామ స్థాయిలో నిర్వాహకులకు మార్గదర్శిగా నిలవడం వరకు ప్రముఖంగా నిలువనుంది. కొ-విన్ యాప్‌లో పేరు నమోదైనవారికి మాత్రమే టీకా అందనుంది. ఇప్పటికే కొవిన్ యాప్‌లో 79 లక్షల మంది లబ్ధిదారుల పేర్లు నమోదవడం గమనార్హం. టీకా పంపిణీ ప్రక్రియపై ఇప్పటికే మూడు సార్లు ట్రయల్ రన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. రెండు సార్లు దేశవ్యాప్తంగా డ్రైరన్ నిర్వహించారు. ఆక్స్‌ఫర్డ్ టీకా, భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్ టీకాలకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అత్యవసర వినియోగ అనుమతులను ఇచ్చి వారం దాటింది. ఈ నేపథ్యంలో కరోనా టీకా పంపిణీ తేదీపై అంతటా ఆసక్తి నెలకొంది.

ప్రజల భాగస్వామ్యం అవసరం

కరోనా పరిస్థితులు, టీకా పంపిణీపై ప్రధాని మోడీ, కేబినెట్ సెక్రెటరీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ (పీఎం), ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఇతర సీనియర్ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కొవిన్ యాప్ పాత్ర గురించి అధికారులు ప్రధానమంత్రికి వివరించారు. వ్యాక్సినేషన్‌పై రాష్ట్రాల సన్నద్ధత, కేంద్ర ప్రభుత్వ సమన్వయంపై వివరాలు అందించారు. టీకా పంపిణీకి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఇందులో ప్రజల భాగస్వామ్యం కీలకమని, ఎన్నికల బూత్ స్ట్రాటజీ అనుభవాన్ని వినియోగించుకోవడం అవసరమని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆరోగ్య సదుపాయాలు, సేవలపై రాజీ పడొద్దని, ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వినియోగం అత్యావశ్యకమని వివరించారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లతోపాటు శాస్త్రీయ, రెగ్యులేటరీ నిబంధనలపైనా రాజీ కూడదని పేర్కొన్నారు. టెక్నాలజీ ఆధారంగా టీకా పంపిణీ సులువుగా, సరళంగా సాగుతుందని తెలిపారు.

90కి చేరిన కొత్తరకం కరోనా కేసులు

దేశంలో కొత్త రకం కరోనా కేసుల సంఖ్య 90కి చేరింది. మధ్యప్రదేశ్‌లో శుక్రవారం తొలి కేసు నమోదైంది. యూకే నుంచి ఇండోర్‌కు తిరిగివచ్చిన ఒకరికి కొత్తరకం కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. మహారాష్ట్రలో కొత్తగా మరో మూడు కేసులు వెలుగుచూశాయి. దీంతో ఈ రాష్ట్రంలో యూకే వేరియంట్ కేసుల సంఖ్య 11కు చేరగా, దేశవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 90కి పెరిగింది.


Next Story

Most Viewed