రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు

by  |
రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాక వైద్యం ఖర్చు రూ.1000 దాటితే అలాంటి వాటికి ఆరోగ్యశ్రీ వర్తింపజేయనున్నట్లు తెలిపింది. గురువారం నుంచి ఈ పథకాన్ని 6 జిల్లాలకు విస్తరిస్తున్నట్లు ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. కొత్తగా విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు జిల్లాల్లో అమలు చేయనున్నట్లు వివరించారు. ఈ పథకం ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్‌గా కొనసాగుతోంది. కొత్తగా విస్తరించిన జిల్లాల్లో నవంబర్ 14నుంచి ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది.

సీఎం జగన్ మాట్లాడుతూ..రాష్ట్రంలో కోటి 42లక్షల మందికి ఆరోగ్య శ్రీ కార్డులు ఇచ్చామన్నారు. అంతేకాకుండా, ప్రతి ఒక్కరీ ఆరోగ్య సమాచారాన్ని రికార్డు చేస్తున్నట్లు తెలిపారు. ఇదివరకు ఉన్న ఆరోగ్య శ్రీలో సమూల మార్పులు తీసుకొస్తున్నామని.. 2200వ్యాధులను ఈ పథకంలో చేర్చామన్నారు. ఇప్పటివరకు ఉన్న 11టీచింగ్ ఆస్పత్రులతో పాటు, మరో 16ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొత్త ఆస్పత్రుల నిర్మాణం కోసం రూ.16 వేల కోట్లను రానున్న రోజుల్లో ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. అలాగే, ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో 500 రకాల మందులు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కరోనా చికిత్సను ఏప్రిల్ 6వ తేదీనే ఆరోగ్యశ్రీలో చేర్చింది. అయితే, నాన్ ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లోనూ కరోనాకు చికిత్స అందించనున్నట్లు తాజాగా ఏపీ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

Next Story

Most Viewed