కేరళలో థర్డ్ వేవ్ సంకేతాలు?

by  |
corona,-Kerala
X

తిరువనంతపురం: దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుంటే కేరళలో మాత్రం అందుకు విరుద్ధ పరిస్థితి ఉన్నది. గత నెలరోజుల్లో దేశంలో కొత్త కేసుల సంఖ్య 80వేల నుంచి 40వేలకు అంటే సగానికి పడిపోయింది. కానీ, కేరళలో మాత్రం ఈ తగ్గుదల కనిపించట్లేదు. నెల రోజులుగా కొత్త కేసులు పదివేలకు అటూ ఇటూగా నమోదవుతున్నాయి. జూన్ 15 నుంచి దేశంలోని కొత్త కేసుల్లో సింహభాగం ఇక్కడి నుంచే నమోదవుతున్నాయి. గత రెండు రోజులుగా దేశంలోని మొత్తం కేసుల్లో మూడొంతులకు పైగా కేరళ నుంచే రిపోర్ట్ అవుతుండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది.

దాదాపు పెద్ద రాష్ట్రాలన్నీ కొత్త కేసుల రికార్డులో తగ్గుదలను నమోదుచేశాయి. తద్వారా యాక్టివ్ కేసులూ తగ్గిపోతున్నాయి. కానీ, కేరళలో మాత్రం గడిచిన పది రోజుల్లో సుమారు 12వేల యాక్టివ్ కేసులు పెరిగాయి. జూన్ 28న రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 96వేలు ఉండగా బుధవారానికి ఇవి 1.08 లక్షలకు పెరిగాయి. ఈ స్థాయిలో యాక్టివ్ కేసులు పెరగడం ఆందోళనకరంగా మారింది. ఇది థర్డ్ వేవ్‌కు సంకేతాలుగా నిపుణులు భావిస్తున్నారు. సెకండ్ వేవ్ పూర్తవ్వకముందే థర్డ్ వేవ్ ప్రారంభమవుతుందని ఇటీవలే కొందరు నిపుణులు అంచనా వేశారు. సెకండ్ వేవ్‌ సూచికలు తొలిగా కేరళ, మహారాష్ట్రల్లోనే కనిపించాయి.

జనవరిలోనూ ఇదే తీరు

కరోనాను మహమ్మారిగా ప్రకటించక మునుపే దేశంలో తొలి కేసు కేరళలోనే నమోదైంది. తర్వాత ఇతర రాష్ట్రాల్లోనూ కేసులు పెరిగాయి. తొలి వేవ్ సహా సెకండ్ వేవ్‌లోనూ ఈ రాష్ట్రంలో కేసులు భారీగా నమోదయ్యాయి. సెకండ్ వేవ్‌కు ముందు జనవరిలోనూ దేశవ్యాప్తంగా కేసులు తగ్గిపోతుంటే కేరళలో మాత్రం నిలకడగా రిపోర్ట్ అయ్యాయి. కొన్ని రోజుల్లోనైతే దేశంలో 60శాతం కేసులు ఇక్కడి నుంచే వెలుగులోకి వచ్చాయి. నేడూ అత్యధిక కేసులు ఈ రాష్ట్రం నుంచే నమోదవుతున్నాయి. రాష్ట్రంలో 45శాతం మందికి తొలి టీకా, పదిశాతం మందికి రెండో టీకా పూర్తయినప్పటికీ కేసులు తగ్గకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే థర్డ్ వేవ్ భయాలు నెలకొంటున్నాయి.

Next Story

Most Viewed