బిగ్‌ బ్రేకింగ్: తెలంగాణలో బడి ‘గంట కొట్టకముందే’ బ్రేక్!

by  |
Telangana Schools
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: కరోనా మహమ్మారి పుణ్యమంటూ దాదాపు ఏడాదిన్నర కాలం తర్వాత బడుల్లో ప్రత్యక్ష తరగతులను జూలై ఒకటో తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఉపాధ్యాయులంతా ఈనెల 25(శుక్రవారం) నుంచి పాఠశాలలకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో జూలై 1వ తేదీ నుంచి పిల్లలు బడులకు వెళ్లాల్సి ఉంది. ఇప్పటివరకు ఆన్‌లైన్ తరగతుల నిర్వహణతో పెద్దగా పిల్లలకు ప్రయోజనం కలగలేదనేది అక్షర సత్యం. ఈ క్రమంలోనే పిల్లలకు ప్రత్యక్ష పద్ధతిలో పాఠాలు చెప్పేందుకు రంగం సిద్ధం చేసింది. కానీ కరోనా థర్డ్ వేవ్ ముంపు ముంచుకొస్తుందనే తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష తరగతుల నిర్ణయాన్నీ మళ్లీ వాయిదా వేయాలని భావించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ శనివారం ప్రత్యక్ష తరగతులను మరికొన్ని రోజులపాటు వాయిదా వేయాలంటూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు.

విదేశాల్లో మొదలైన థర్డ్ వేవ్..

కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ ఇప్పటికే కొన్ని దేశాల్లో డెల్టా ప్లస్ రూపంలో ముంచుకొస్తుంది. ఆడపాదడపా కేసులు సైతం వెలుగులోకి వచ్చాయి. డెల్టా ప్లస్ ఊహించని తీవ్రత ఉంటుందని, మాస్కు లేకుండా కరోనా పాజిటివ్ వ్యక్తి పక్క నుంచి నడుచుకుంటూ వెళ్లినా.. కరోనా సోకుతుందనే ప్రచారం ఓపక్క జరుగుతోంది. మరోపక్క థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపైనే అధికంగా ఉంటుందనే ప్రచారం లేకపోలేదు. దీంతో తల్లిదండ్రుల్లోనూ ఒకింత భయాందోళన లేకపోలేదు. బడికి పోయి ప్రమాదం కొని తెచ్చుకోవడం కంటే.. ఇంట్లో ఉండి ఆన్‌లైన్ విధానం పాఠాలు వినడం మేలు అనే ఆలోచనలో తల్లిదండ్రులు ఉండడం గమనార్హం.

ప్రైవేటులో ఫీజుల వసూళ్లు కారణమే..

జూలై ఒకటి నుంచి ప్రత్యక్ష తరగతులకు హాజరవ్వడంపై ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని మేధావులు చెబుతున్నా.. ప్రభుత్వం ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు పూనుకోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. నిజానికి జూలై ఒకటి నుంచి పాఠశాలలు ప్రారంభమైతే.. ఒకట్రెండు నెలల్లోనే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గరి నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తారనడంలో ఏలాంటి సందేహం లేదు. ఫీజు అంతా వసూలు చేసుకున్నాక.. కరోనా థర్డ్ వేవ్ అంటూ బడులు మూసేస్తే.. అప్పుడు ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడం ఖాయం. దీనికితోడు పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తే.. పిల్లలపై కరోనా థర్డ్ వేవ్ ప్రభావం పడితే.. ఆ అప్రతిష్టను సైతం ప్రభుత్వమే మూట గట్టుకుంటుందనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష తరగతులను మరికొన్ని రోజుల పాటు వాయిదా వేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలుస్తోంది.

సగం మంది టీచర్లు విధుల్లోకి..

జూలై ఒకటో తేదీ నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభం అవుతాయనే ఉద్దేశంతో ఇప్పటికే టీచర్లు తమ విధులకు హాజరువుతున్నారు. అయితే కరోనా వైరస్ ఎఫెక్ట్ నేపథ్యంలో ప్రత్యక్ష తరగతులను ప్రభుత్వం వాయిదా వేస్తే.. బడులకు సగం మంది టీచర్లు మాత్రమే హాజరయ్యేలా ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చాలామంది టీచర్లు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఒక రోజు తప్పించి మరో రోజు సగం మంది ఉపాధ్యాయులు విధులకు హాజరయ్యేలా విద్యాశాఖ నిర్ణయం తీసుకోనుంది.

Next Story

Most Viewed