నిజామాబాద్‌లో ఫీల్డ్​ స్టాఫ్​తో కరోనా టెస్టులు!

by  |
నిజామాబాద్‌లో ఫీల్డ్​ స్టాఫ్​తో కరోనా టెస్టులు!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కరోనా ఉధృతి నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొవిడ్ ​టెస్టుల సంఖ్యను పెంచాలని సర్కారు నిర్ణయించింది. అయితే ఇందుకు ఫీల్డ్​ స్టాఫ్​ను వినియోగించడం వారిలో ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 20 వరకు ప్రతి నిత్యం 500 లోపే కరోనా పరీక్షలు జరిగేవి. అయితే అప్పటి వరకే జిల్లా జనరల్ ఆస్పత్రితోపాటు ఏరియా హాస్పిటల్, ప్రాథమిక, అర్బన్ హెల్త్ సెంటర్లలో నిర్వహించిన టెస్టులలో పాజిటివ్​ కేసులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ సంచాలకుల ఆదేశాల మేరకు కొవిడ్​ టెస్ట్​లను పెంచాలని, అందులో డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్​లతో పాటు ఏఎన్ఎం, జీఎన్ఎంలను భాగస్వాములను చేయడం సరికాదని పలువురు ఆరోపిస్తున్నారు.

పెరుగుతున్న కేసులు

ఉమ్మడి జిల్లాలో కరోనా పరీక్షలు విరివిగా చేస్తుండడం వల్ల పాజిటివ్​ కేసుల సంఖ్య కూడా పెరుగుతున్నది. నిజామాబాద్ ​జిల్లాలో శుక్ర, శని, ఆదివారాల్లో 9,294 మంది అనుమానితులకు పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో మొత్తం ఇప్పటి వరకు 22వేల పరీక్షలు చేయగా, అందులో 3258 పాజిటివ్​ కేసులు ఉన్నట్లు తెలిసింది. కామారెడ్డి జిల్లాలో ఆదివారం వరకు 14650 టెస్టులు చేయగా, 2654 పాజిటివ్​ కేసులు తేలాయి. ఈనెల 21 నుంచి పీహెచ్​సీకి అనుబంధంగా నిజామాబాద్ జిల్లాలో 127 కేంద్రాలను, కామారెడ్డి జిల్లాలో 27 కొత్త పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిత్యం నిజామాబాద్ జిల్లాలో 2500, కామారెడ్డి జిల్లాలో 1500 పైచిలుకు టెస్టులు చేయాలని టార్గెట్ విధించారు. ఇందుకు గాను సెలవులు, పండగలని సంబంధం లేకుండా కరోనా పరీక్షలు చేయడంలో వైద్యారోగ్య శాఖ తలమునకలైంది.

ఆందోళనలో వైద్య సిబ్బంది

కరోనా పరీక్షలు చేసేందుకు డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్​లతోపాటు ఏఎన్ఎం, జీఎన్ఎంలను భాగస్వామ్యం చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకోవడంతో రోజువారీ విధుల నిర్వహణపై వారంతా ఆందోళన చెందుతున్నారు. పరీక్షలు చేసే సమయంలో ఒకవేళ వారికి వైరస్​ సోకినట్లయితే విధి నిర్వహణలో చిన్నపిల్లలు, గర్భిణులకు యూఐసీ నిర్వహించినప్పుడు, గ్రామాల్లో వృద్ధులకు, ఎన్ సీడీ పేషెంట్లకు మందులు పంపిణీ చేసినప్పుడు వైరస్ వ్యాపించే అవకాశాలు ఎక్కువే. ఫీల్డ్ స్టాఫ్ తో కరోనా టెస్టులు చేయించడం సమాజానికి అత్యంత ప్రమాదకరమని, అలా చేస్తే ప్రజలను ఇంకా ప్రమాదంలోకి నెట్టినట్లవుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు టెక్నికల్ గా ట్రైన్డ్ అయిన ల్యాబ్ టెక్నీషియన్లను నియమించాలని కోరుతున్నారు. ఈ విషయమై అధికారులు పునరాలోచించాలని కోరుతూ ఫీల్డ్ స్టాఫ్​ వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.



Next Story

Most Viewed