నిలువుదోపిడి.. ఆర్టీపీసీఆర్ టెస్టు నాడు రూ.500.. నేడు రూ.2000

by  |
Dry Swab RTPCR Test
X

దిశ ప్రతినిధి, వరంగల్ : కొవిడ్ మహమ్మారి వరంగల్ లోని కొన్ని ప్రయివేటు ఆస్పత్రులకు వరంగా మారింది. వరంగల్ పట్టణంలో పదుల సంఖ్యలో ప్రయివేటు ఆస్పత్రులకు కోవిడ్ చికిత్స అందించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అనుమతులు ఇచ్చింది. ఇలా అనుమతులు పొందిన చాలా ఆస్పత్రులు సొంతంగా లాబులను సైతం నిర్వహిస్తున్నాయి. దనార్జనే ద్యేయంగా చికిత్స, టెస్టుల పేరుతో కరోనా రోగుల నుంచి కావాల్సినన్ని కాసులను పిండుకుంటున్నాయి. సాధారణ జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారిని మరింత బయపెట్టేలా టెస్టుల పేరుతో ఫీజులు వసూలు చేసుకునే పనిలో నిమగ్నమవుతున్నాయి. కరోనా బాధితుడు, రోగి కుటుంబ సభ్యులు ప్రాణం దక్కలనే ఆపదలో ఎంత ఖర్చైనా ఫర్వాలేదు అని మాటను ఆస్పత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి. టెస్టుల దగ్గర నుంచి దోపిడీ చేయడం మొదలు పెడుతున్నాయి.

అప్పుడు టెస్టుకు 500.. ఇప్పుడు 2000

కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారు వేగంగా నిర్దారణ ఫలితాలను పొందేందుకు రాపిడ్ టెస్టులు చేయించుకుంటున్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల నిర్వహణ కేవలం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల్లో మాత్రమే జరుగుతోంది. ఈ కేంద్రాల్లో ఫలితాలు తెలిసే సరికి మూడు రోజుల సమయం పడుతోంది. గత్యంతరం లేక రాపిడ్ టెస్టుల వైపే జనం వెలసి వస్తోంది. కరోనా అనుమానిత లక్షణాలు కలిగి ఉన్న వారి అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని టెస్టుల రేట్లను మూడింతలుగా పెంచేయడం గమనార్హం. నెల క్రితం వరకు కూడా రూ.500లు ఉన్న రాపిడ్ టెస్ట్‌కు ఇప్పుడు ఏకంగా రూ2000 వసూలు చేస్తున్నారు. సామాన్య ప్రజలు మోయలేంత భారంగా కరోనా నిర్దారణ పరీక్షలు మారిపోవడంపై జనాలు మండిపోతున్నారు. ఒక్కో ఇంట్లో నలుగురైదుగురు కరోనా అనుమానిత లక్షణాలు కలిగి ఉన్న వారు.. అప్పు చేసి మరీ టెస్టులకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వాస్తవానికి రాపిడ్ టెస్ట్ నిర్వహించే కిట్ కాస్ట్ రూ.150 నుంచి రూ.300 లోపు ఉంటుంది. సర్వీస్ చార్జెస్ కింద రూ.200 కలుపుకుని రూ.500 వసూలు చేసే వారు. ఇప్పుడు ఈ టెస్టు కాస్ట్ ను ఒక్కసారిగా ముడింతలు రూ.2000 పెంచి దోపిడీకి పాల్పడుతున్నారు.

కళ్ళు మూసుకున్న విజిలెన్స్..

కరోనా పరీక్షల పేరిట జరుగుతున్న దోపిడీని నివారించాల్సిన వైద్య ఆరోగ్యశాఖ, విజిలెన్స్ అధికారులు ఏ మాత్రం పట్టించుకోకుండా ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా ఖమ్మం, కరీంనగర్ జిల్లాల నుంచి కరోనా పరీక్షలకు వస్తుండటంతో ఒక్కో ఆస్పత్రి రోజూ లక్షల రూపాయలను దండుకుంటోంది.

ఫలితాలు కూడా ఆలస్యమే..

ఇదిలావుండగా ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో నిర్దారణ పరీక్షలకు ఆన్లైన్ చేయడం జాప్యం జరుగుతోంది. నమూనాలు సేకరించడం కూడా అంతంత మాత్రంగా జరుగుతోంది. ఆ ఫలితాలు ప్రకటించడం కూడా అదే మాదిరిగా ఉంది. ప్రస్తుతం ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌ ద్వారా మాత్రమే శాంపిల్స్‌ను పరీక్షిస్తున్నారు. అనుమానితుల నుంచి నమూనాలను సేకరించిన మూడు రోజులకు కూడా ఫలితాలు అందడం లేదు. ల్యాబ్‌లో పరీక్షల సామర్థ్యం మరింత పెంచాల్సిన అవసరముంది. కరోనా అనుమానితులు నమూనాలు ఇచ్చాక ఇష్టానుసారంగా బయట తిరుగుతుండటం గమనార్హం.



Next Story

Most Viewed