కరోనా టెస్ట్.. ఒక్కో చోట ఒక్కో రేటు

by  |
Corona test
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానం రావడంతోనే గుండెల్లో దడ పుడుతోంది. టెస్టు చేయించుకోవడం మొదలు ఆస్పత్రిలో చేరితే డిశ్చార్జి అయ్యేంతవరకు ఎంత బిల్లు పడుతుందోననే భయం ప్రజలను వెంటాడుతోంది. వైద్య పరీక్షలకు నిర్దిష్ట ధర అంటూ లేకుండా ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నాయి. టెస్టుల పేరుతో అందినకాడికి గుంజుతున్నాయి. పేషెంట్ల జేబులు గుల్లవుతున్నాయి. రాపిడ్ టెస్టుకే రూ.1500 వసూలు చేస్తున్నాయి. కరోనా సమయంలో కార్పొరేటు, ప్రైవేటు ఆస్పత్రుల యథేచ్ఛగా దోచుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగానే ఉంది. ఫిర్యాదులు వచ్చిన ఒకటి రెండు ఆస్పత్రులపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని మిగిలినవాటిని గాలికొదిలేసింది.

కరోనా చికిత్సకు ఏ వార్డులో ఎంత ఛార్జీలు వసూలు చేయాలో ప్రభుత్వం స్పష్టమైన జీవో జారీ చేసినా వాటిని కార్పొరేటు, ప్రైవేటు ఆస్పత్రులు బుట్టదాఖలా చేశాయి. ఒక్కో ఆస్పత్రి ఒక్కో రేటును వసూలు చేస్తున్నాయి. ఆర్‌టీ-పీసీఆర్ టెస్టుకు ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ. 500 మించి వసూలు చేయవద్దని ప్రభుత్వం స్పష్టంగా ఉత్తర్వులు జారీచేసినా ఇప్పటికీ వేలల్లో వసూలు చేస్తున్నాయి. ఒక్కో పీపీఈ కిట్‌కే ఏకంగా రూ. 2,430 చొప్పున పేషెంట్ల నెత్తిన రుద్దుతున్నాయి. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఒక పేషెంట్ కేవలం 13 గంటల పాటు ఐసీయూ వార్డులో అడ్మిట్ అయితే మూడు పీపీఈ కిట్లు వాడినట్లు రూ. 7,290 వసూలు చేసింది. చివరికి ఆ పేషెంట్ డెడ్‌బాడీ రూపంలో బైటకు వచ్చారు. ఐసీయూ వార్డులో ట్రీట్‌మెంట్ ఇచ్చినందుకు రసూ. 7,500 మాత్రమే వసూలు చేయాలని చెప్పిన ప్రభుత్వం డ్రగ్స్, కన్సల్టేషన్ ఛార్జీలన్నీ అందులోనే కలిసి ఉంటాయని పేర్కొన్నా వీటికి అదనంగా వసూలు చేసింది.

ఇక సీటీ స్కాన్, రకరకాల పరీక్షల పేరుతో కార్పొరేటు, ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీఈ కిట్లతో సహా కలిపి రూ. 3000 కంటే ఎక్కువ వసూలు చేయొద్దంటూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కానీ తెలంగాణలో అలాంటిది లేకపోవడంతో ఒక ఆస్పత్రి రూ. 6,500 వసూలు చేస్తే ఇంకో ఆస్పత్రి రూ. 7,000 వసూలు చేస్తున్నది. ఒక్క ఆస్పత్రిలో ఒక్కో రేటు ఎందుకు ఉంటుందో, ఎంత ఉండాలో ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. కరోనా సమయంలో ప్రజలు పాజిటివ్ బారిన పడి అన్ని ఆదాయ మార్గాలను కోల్పోయి ఆస్పత్రిలో చేరితే చివరకు వారి వైద్య ఖర్చులకు లక్షల రూపాయలు చెల్లించుకోవాల్సి వస్తోంది.

కరోనా సోకిన తర్వాత పేషెంట్లు ఆందోళనలో ఉంటే ఈ అవకాశాన్ని లాభాలుగా మార్చుకుంటున్నాయి కార్పొరేట్ ఆస్పత్రులు. బాధలో ఉన్న పేషెంట్లను మరింత బాధపెట్టవద్దని మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో జరిగిన సమావేశం సందర్భంగా స్పష్టం చేశారు. కానీ వారి దోపిడీ ఆగకపోవడంతో మూడు రోజుల క్రితం మీడియా సమావేశంలోనే కార్పొరేట్ ఆస్పత్రుల బాధ్యతా రాహిత్యాన్ని తూర్పార బట్టారు. “కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు శవాల మీద పేలాలు ఏరుకుంటున్నాయి“ అంటూ తన ఆవేదనను వెళ్ళగక్కారు. కానీ అలాంటి ఆస్పత్రుల్లో విచారణ జరిపించడంగానీ, చర్యలు తీసుకోవాలని ఆదేశించడంగానీ చేయలేదు.



Next Story

Most Viewed