టెన్షన్ పెడుతోన్న కరోనా స్ట్రెయిన్ !

by  |
India corona cases
X

దిశ, తెలంగాణ బ్యూరో: బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్త రకం కరోనా స్ట్రెయిన్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖను టెన్షన్ పెడుతోంది. బ్రిటన్ నుంచి వచ్చిన 1216 మందిలో ఇంకా 154 మంది జాడ తెలియలేదు. ఇప్పటివరకు 18 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా ఆదివారం మరో ఇద్దరికి కూడా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో కొత్తగా కరోనాబారిన పడినవారి సంఖ్య ఇరవైకు చేరుకుంది. వీరికి తోడు మరో ముగ్గురు ప్రైమరీ కాంటాక్టు వ్యక్తులకు కూడా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరందరికీ సోకింది కొత్త రకం కరోనా వైరస్సా లేక పాతదేనా అనేదానిపై ఇంకా సీసీఎంబీ లాబ్ నుంచి వివరాలు అందలేదు. జీన్ సీక్వెన్స్ మ్యాపింగ్ చేసిన తర్వాత క్లారిటీ వస్తుందని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.

బ్రిటన్ నుంచి డిసెంబరు 9 తర్వాత శంషాబాద్ విమానాశ్రయానికి మొత్తం 1216 మంది ప్రయాణికులు వచ్చారని, ఇందులో 92 మంది వివిధ రాష్ట్రాలకు చెందినవారు కావడంతో అక్కడికి వెళ్ళిపోయారని, ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు వివరాలు అందించి అప్రమత్తం చేశామని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. అయితే శనివారం వరకూ 184 మంది వివరాలు అందలేదని, అందులో 30 మంది జాడ కనిపెట్టడంతో ఇంకా 154 మంది గురించి వెతుకుతున్నట్లు తెలిపారు. కొత్తగా వైరస్ వచ్చిన ఇద్దరూ మల్కాజిగిరి జిల్లాకు చెందినవారని తెలిపారు. దీంతో ఇప్పటివరకు కొత్తగా వైరస్ బారిన పడిన ఇరవై మందిలో నలుగురు హైదరాబాద్, ఎనిమిది మంది మల్కాజిగిరి, ఇద్దరు జగిత్యాల జిల్లాలకు చెందినవారు కాగా మిగిలినవారు మంచిర్యాల, నల్లగొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లాలకు చెందినవారని వివరించారు.

Next Story

Most Viewed