సూర్యాపేటలో సంచలనం.. DMHO ఫ్యామిలీలో ఆరుగురికి పాజిటివ్

by  |
Suryapet DMHO
X

దిశ, సూర్యాపేట: ప్రపంచ దేశాలను కొత్త కరోనా కొత్త వేరియంట్ భయబ్రాంతులకు గురిచేస్తోన్న సంగతి తెలిసిందే. ఇండియాలోని బెంగళూరు నగరంలో ఇవాళ(గురువారం) రెండు కొత్త కేసులు నమోదు కావడంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిపై సంపూర్ణ అవగాహన ఉండి, అందరికీ జాగ్రత్తలు చెప్పాల్సిన వైద్యాధికారే తాజాగా.. కొవిడ్ బారినపడ్డారు. విదేశాల నుంచి వచ్చిన వారిని పదిహేను రోజుల పాటు క్వారంటైన్ చేయాలని ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నా.. ఆ వైద్యాధికారి మాత్రం పెడచెవిన పెట్టారు.

వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా డీఎంహెచ్ఓ కోటాచలం కుటుంబంలో తాజాగా.. ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఐదు రోజుల క్రితం డీఎంహెచ్ఓ కుమారుడు జర్మనీ నుంచి రావడంతో ఇటీవల కుటుంబం మొత్తం కలిసి తిరుపతికి వెళ్లారు. తిరుపతి నుంచి వచ్చిన అనంతరం కుటుంబ సభ్యుల్లో కొవిడ్ లక్షణాలు బయటపడంతో అందరూ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దీంతో డీఎంహెచ్‌ఓ సహా ఐదుగురికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. అంతేగాకుండా.. బుధవారం రోజున ఎయిడ్స్ డే కార్యక్రమంలోనూ పాల్గొన్న డీఎంహెచ్‌వో కోటాచలం, ఆయన చేతుల మీదుగా వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించాడు. ఇతర దేశాల్లో కొత్త వేరియంట్ విజృంభిస్తున్న తరుణంలో ఏకంగా డీఎంహెచ్‌ఓ ఇంట్లోనే ఆరుగురికి పాజిటివ్ రావడం జిల్లాలో కలకలం రేపుతోంది. జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బందితో పాటు ఎయిడ్స్ డేలో పాల్గొన్న వారిలోనూ ఆందోళన మొదలైంది. దీంతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కొవిడ్ మాత్రమేనా కొత్త వేరియంట్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో డాక్టర్లు పరీశీలిస్తున్నారు. తిరుపతి వెళ్లి వచ్చినందున ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ కూడా అప్రమత్తమైనట్లు సమాచారం.

Next Story

Most Viewed