ప్రపంచంలో 11వ స్థానంలో భారత్

by  |
ప్రపంచంలో 11వ స్థానంలో భారత్
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా పాజిటివ్ కేసుల్లో భారత్.. చైనాను దాటేసింది. కేంద్ర ఆరోగ్య‌శాఖ బులెటిన్ ప్రకారం శనివారం 3,970 కొత్త కేసులు నమోదు కావడంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 85,940కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 2,753 మంది మరణించగా 30,153 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 53,035 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రపంచంలో భారత్ 11వ స్థానానికి చేరుకుంది. చైనా 13వ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా పదివేల కేసులు దాటిన రాష్ట్రాలు మహారాష్ట్ర, తమిళనాడు మాత్రమే ఉంటే ఇప్పుడు వాటి సరసన గుజరాత్ కూడా చేరింది.

దేశంలో లాక్‌డౌన్ విధించకముందు కేసులు రెట్టింపు కావడానికి కేవలం మూడున్నర రోజులు పడితే.. లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం ఇది 11 రోజులకు పెరిగింది. చైనాలో వ్యాధి సోకిన 80 వేల మందిలో 4,633 మంది చనిపోవడంతో మృతుల శాతం 5.5 శాతంగా ఉంది. భారత్‌లో ఈ రేటు 3.2 శాతంగా ఉండడం కాస్త ఊరట కలిగిస్తోంది. మహారాష్ట్రలో శనివారం ఒక్కరోజే 1606 కేసులు నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 30,706కు చేరింది. ఇక్కడ ఇప్పటివరకు వ్యాధి బారిన పడి 1,135మంది చనిపోగా 7,088 మంది చికిత్స అనంతరం కోలుకున్నారు. రాజధాని ముంబైలో ఒక్కరోజే 884 కేసులు నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 18,396కు చేరింది. ఇక్కడ కరోనాతో ఇప్పటివరకు 696 మంది ప్రాణాలు కోల్పోయారు.

గుజరాత్‌లో శనివారం ఒక్కరోజే 348 కొత్త కేసులు నమోదుకాగా ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 10,989కి చేరింది. ఇక్కడ ఇప్పటివరకు కరోనాతో 625 మంది మరణించారు. తమిళనాడులో ఒక్కరోజులోనే 477 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 10,585కు చేరింది. కరోనాతో ఇప్పటివరకు 74 మంది మరణించగా శనివారం ఒక్కరోజే ముగ్గురు చనిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో 48 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 2,205కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో 31 మంది తమిళనాడులో వ్యాధి సూపర్ స్ప్రెడర్‌గా ఉన్న కోయంబేడు మార్కెట్‌తో లింక్ ఉన్నవారేనని అధికారులు వెల్లడించారు. శనివారం ఏపీలో కరోనాతో ఒకరు మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 49కి చేరింది. ఇప్పటివరకు 1,353 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.

ఇక తెలంగాణలో గడచిన 24 గంటల్లో 55 కొత్త కేసులు నమోదైతే ఇందులో 44 జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. వీటిలో 23 పాజిటివ్ కేసులు ఒక్క అపార్ట్‌మెంటు పరిధిలోనే నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చినవారిలో ఎనిమిది మందికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది.

భారత్ :

మొత్తం కేసులు : 85,940
రికవరీ : 30,153
మృతులు : 2,753

తెలంగాణ :

మొత్తం కేసులు : 1,509
రికవరీ : 971
మృతులు : 34

ఆంధ్రప్రదేశ్ :

మొత్తం కేసులు : 2,205
రికవరీ : 1,353
మృతులు : 49

Next Story

Most Viewed