జనాల్లోకి వస్తున్న కరోనా పేషెంట్లు.. చర్యలు తీసుకోరా..!

by  |
జనాల్లోకి వస్తున్న కరోనా పేషెంట్లు.. చర్యలు తీసుకోరా..!
X

దిశ, భద్రాచలం : తెలంగాణలో లాక్‌డౌ‌న్ పెట్టినా కరోనా కంట్రోల్ కావడం లేదు. రోజురోజుకి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో మరణాల సంఖ్య ఆందోళనకరంగా మారుతోంది. నిత్యావసరాల కోసం లాక్‌డౌన్ సడలింపు ఇచ్చిన నాలుగు గంటల్లోనే జనం రోడ్లపైకి వచ్చి గుంపులుగా తిరుగుతున్నారు. మరో విషయం ఏటంటే అడిగేవారు ఎవరు అన్నట్లుగా పాజిటివ్ పేషెంట్లు, వారి ఇళ్ళలోని వారు (ప్రైమరీ కాంట్రాక్ట్స్) కూడా జనంలో తిరిగేస్తున్నారు. తమ ఇంట్లో వారికి పాజిటివ్ వచ్చినా తమకు ఎలాంటి లక్షణాలు లేవంటూ బజార్లలోకి వచ్చి ఇష్టానుసారంగా తిరుగుతూ రెండుమూడు రోజుల్లోనే వారు కరోనా బారినపడుతున్నారు. ఫలితంగా జరగాల్సిన నష్టమంతా జరిగిపోతోంది. వీరి నిర్లక్ష్యం కారణంగా కరోనా మహమ్మారి ఇతరులకు కూడా సోకుతోంది.

కరోనా పరీక్షల వద్ద గుంపుగా..

కరోనా కట్టడి కోసం మాస్క్, భౌతికదూరం, శానిటైజర్ ఉపయోగించాలని పదేపదే హెచ్చరిస్తున్నా ఆచరించేవారు అతి తక్కువ అని చెప్పవచ్చు. స్వీయ రక్షణ చర్యలు నామమాత్రం.‌ కొందరైతే మూతి, ముఖానికి పెట్టుకోవాల్సిన మాస్క్ మొక్కుబడిగా గడ్డం క్రింద గొంతుకు పెట్టుకుంటున్నారు. మరికొందరు మాస్క్‌లు లేకుండానే రోడ్లపై తిరిగేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ సూచనతో పరిమిత సంఖ్యలోనే ప్రతిరోజు కరోనా పరీక్షలు చేస్తుండగా, లాక్‌డౌ‌న్ సమయంలోనూ 50 శాతానికిపైగా పాజిటివ్ కేసులు ప్రతిరోజు నమోదు అవుతున్నాయి.

ప్రజల నిర్లక్ష్యం, అధికారుల అలక్ష్యం కారణంగా కొవిడ్ కేసులు పెరగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు నిర్వహించే ప్రదేశంలో కనీస భౌతికదూరం నిబంధనలు అమలు కావడం లేదు. పరీక్షలకి వచ్చినవారు క్యూలో ఒకరినొకరు ఆనుకొని నిలబడుతున్నారు. ఆసుపత్రులలో కరోనా పరీక్షలు, కొవిడ్ ఇంజెక్షన్లు పక్కపక్క రూముల్లో ఏర్పాటు చేయడం వలన కరోనా ప్రబలడానికి ప్రధాన కారణమని చర్ల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పలువురు డిఎంహెచ్‌వో దృష్టికి తీసుకెళ్ళినా ఫలితంలేదు.‌ ఆసుపత్రుల వద్ద భౌతికదూరం అమలు చేయాల్సిన అధికార యంత్రాంగమే నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని చర్ల వాసులు కోరుతున్నారు.

Next Story

Most Viewed