చనిపోయాడని అంత్యక్రియలు.. అంతలోనే అరటిపండు తింటూ

by  |
చనిపోయాడని అంత్యక్రియలు.. అంతలోనే అరటిపండు తింటూ
X

దిశ, ప్రతినిధి, మెదక్: సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విచిత్రం చోటు చేసుకుంది. ఇద్దరి పేర్లు ఒకే రకంగా ఉండటంతో వైద్యులు పొరబడ్డారు. అందులో ఒక వ్యక్తి మృతి చెందగా… వారి బంధువులకు కాకుండా వేరే వాళ్ళకి అప్పగించారు. తమ బంధువే చనిపోయాడని రాత్రంతా ఏడ్చారు. అంత్యక్రియలు నిర్వహించే సమయంలో చివరి చూపు చూద్దామని చూడగా అది వారి బంధువు కాదని తెలిసింది. వెంటనే వెళ్లి ఆసుపత్రి సిబ్బందిని నిలదీశారు. అప్రమత్తమైన వైద్యులు అదే పేరు కలిగిన వ్యక్తి ఎక్కడున్నాడని వెతకగా ఆస్పత్రిలో అరటి పండు తింటూ కన్పించాడు. ఈ విచిత్ర సంఘటన కాస్త సోషల్ మీడియాలో వైరల్ కాగా రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్న సిద్దిపేట లో ఇటువంటి సంఘటన జరగడం పై నెటిజన్లు కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే….చేర్యాల మండలం వీరన్నపేట గ్రామానికి చెందిన అలిగే బాలయ్య (55) అనే వ్యక్తి కరోనా బారిన పడటంతో సిద్దిపేట జిల్లా ఆస్పత్రి ఐసోలేషన్ వార్డుకి తరలించారు. అదే పేరు కలిగిన బాలయ్య సైతం సిద్దిపేట జిల్లా ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో మరో వ్యక్తి బాలయ్య (77) మృతి చెందాడు. అయితే బాలయ్య పేరుతో ఇద్దరు ఆసుపత్రి చేరడంతో వైద్యులు తికమక పడ్డారు. ఆ కంగారులో తప్పుడు సమాచారం అందించారు. తప్పుడు సమాచారం అందుకున్న చేర్యాల వారి బంధువులు రాత్రంతా దుఃఖ సాగరంలో మునిగిపోయారు. తెల్లవారుజామున ఉదయం 7 గంటల సమయంలో బాలయ్య మృతదేహాన్ని ఇవ్వాలని కోరగా ఆసుపత్రికి సిబ్బంది 9 గంటలకు ప్యాక్ చేసి ఇచ్చారు. చివరి చూపు చూద్దామని చూడగా వారి బంధువు కాదని నిర్దారించారు. వెంటనే ఈ విషయాన్ని వైద్యులకు తెలిపి… తమ బంధువు ఫోటోని చూపించి, తమ బంధువు ఎక్కడ ఉన్నాడో చూపించాలని నిలదీశారు. దీంతో ఆస్పత్రి వైద్యులు, బాలయ్య బంధువులు ఆస్పత్రిలో వెతకగా బెడ్ పైన కూర్చొని భోజనం చేస్తూ కనిపించారు. దీంతో బాలయ్య బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా మృతి చెందిన మరో వ్యక్తి ఎవరన్నది ఆస్పత్రి సిబ్బందికి ఇంకా తెలియడం లేదు. ఇంత పెద్ద ఆస్పత్రిలో వివరాలు నమోదు చేసుకోకుండానే అడ్మిట్ చేసుకున్నారా అంటూ సోషల్ మీడియా లో పలువురు ఆస్పత్రి నిర్వహకం పై కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed