గల్ఫ్‌లో తెలంగాణవాసులకు కరోనా!

by  |
గల్ఫ్‌లో తెలంగాణవాసులకు కరోనా!
X

దిశ, నిజామాబాద్: గల్ఫ్ దేశమైన దుబాయిలో పలువురు తెలంగాణవాసులకు కరోనా సోకినట్లు సమాచారం. ఈ విషయానికి సంబంధించి అక్కడున్న బాధితులు ఓ వీడియోను రూపొందించి దానిని తెలంగాణ గల్ఫ్ వెల్పేర్ సొసైటీ అధ్యక్షులు పాట్కూరి బసంత్‌రెడ్డికి పంపించారు. తనకు చేరిన సమాచారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధితులకు వైద్యంతో పాటు మిగిలిన వారికి పరీక్షలను నిర్వహించేందుకు బసంత్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు.

దేశం కాని దేశంలో ఉపాధి కోసం వలస వెళ్లిన వారిని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. గల్ఫ్ దేశాలలో తెలంగాణ‌వాసులకు కొదవలేదు. ముఖ్యంగా కార్మికులుగా చాలామంది గల్ఫ్ దేశాలలో ఉన్నారు. కొవిడ్-19 ఎక్కువ ఉన్న దేశాలలో గల్ఫ్ దేశాలు ఉన్నాయి. గల్ఫ్ దేశమైన దుబాయిలో అంజుమాన్ క్యాంపులో ఉన్న తెలంగాణ వారికి కరోనా సోకినట్లు తెలిసింది. బెల్ హసా కంపెనీలో వలస కార్మికులుగా తెలంగాణ, కేరళ, పాకిస్తాన్‌కు చెందినవారు పని చేస్తున్నారు.

10 మందికి పాజిటివ్

తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ కు చెందినవారు 80 మంది అక్కడ పని చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో కేరళలోని మలబార్ కు చెందిన వారితో పాటు తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల జిల్లాలకు చెందిన 10 మందికి కొవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు సమాచారం. వారిని అంజుమాన్ ప్రాంతంలోని కార్మికుల క్యాంప్‌లో రెండు గదులకు(హోం క్వారంటైన్) పరిమితి చేసింది యజమాన్యం. వారికి పాజిటివ్ అని నిర్ధారణ అయిన తరువాత వారిని ఇతర కార్మికులు ఉపయోగించే కిచెన్, బాత్రూమ్‌లను వాడుకునేలా చేసింది. అయితే, మిగిలినవారికి కరోనా పరీక్షలు నిర్వహించలేదని సమాచారం.

పనులు చేస్తేనే పరీక్షలు..

పనులు చేస్తేనే పరీక్షలు నిర్వహిస్తామని కంపెనీ పేచీ పెట్టిందని బాధితులు వీడియోలో వాపోతున్నారు. క్యాంప్‌లో ఇరుకు గదుల్లో ఉన్న మిగిలినవారి పరిస్థితి దారుణంగా ఉందని, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని విదేశంగా శాఖ ద్వారా తమను అదుకోవాలని కోరుతూ బాధితులు అక్కడ నెలకొన్న పరిస్థితిని వీడియో తీసి పంపించారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

పలువురు తెలంగాణ వాసులు అక్కడ మృత్యువాత పడ్డారు. కొందరిని అక్కడే ఖననం చేశారు. అందులో ఒకరు హైదరాబాద్ వాసి కాగా మరొకరు నిజామాబాద్ వాసి ఉన్నారు. అక్కడ ఆ ఇద్దరినీ ఖననం చేసిన వీడియో మినహా కుటుంబ సభ్యులను కుడా అనుమతించలేదు అక్కడి ప్రభుత్వం. అక్కడే కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ కరోనా విస్తరణ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొవిడ్-19 విస్తరణ తరువాత గల్ఫ్ దేశాలలో పరిస్థితి దారుణంగా ఉంది. ఎందుకంటే వలస కార్మికులు వారికి కేటాయించిన క్యాంపులలోనే ఉండాల్సిన పరిస్థితి. అక్కడ నిబంధనలు కఠినంగా ఉండటంతో అక్కడ యాజమాన్యాలను ప్రశ్నించలేరు. అలాగనీ బయటకు వెళ్లలేరు. నిబంధనలను ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షిస్తారు. అందుకే అక్కడ కరోనా సోకిన వారితో ఉన్నవారు తమను రక్షించాలని విదేశాంగ ద్వారా మొరపెట్టుకుంటున్నారు. పాజిటివ్ కలిగిన వ్యక్తులతో మొదటి నుంచి కలిసి ఉన్న తమకు ఎక్కడ వ్యాధి ఉన్నదో లేదో నిర్ధారణ పరీక్షలు నిర్వహించకపోవడం లేదని, కరోనా సోకినవారు ఉన్న ప్రాంతంలోనే తాము ఉండటంతో తమకు కూడా ఎక్కడ సోకుతుందోనని వారు భయపడుతున్నారు.

tags: nizamabad people, corona positive, social media, gulf countries

Next Story

Most Viewed