ఫీవర్ సర్వే.. పక్కదారి పడుతున్న కొవిడ్​ కిట్స్.!

by  |
ఫీవర్ సర్వే.. పక్కదారి పడుతున్న కొవిడ్​ కిట్స్.!
X

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ పరిధిలో ఫీవర్​సర్వే ఓ దారీ తెన్నూ లేకుండా సాగుతోంది. వారం రోజులుగా సాగుతున్న సర్వేలో ఎంత మందికి కొవిడ్ లక్షణాలు గుర్తించారో, ఎంత మందికి మెడిసిన్స్​అందించారో జీహెచ్ఎంసీకే తెలియడం లేదు. ప్రతీ రోజూ సర్వే సాగుతున్నట్టు బల్దియా అధికారులు చెబుతున్నా.. ఫీవర్ సర్వేలో మెడిసిన్స్​పక్కదారి పడుతున్నట్టు తెలుస్తోంది. స్థానిక ఏఎన్ఎం, ఆశా వర్కర్, ఎంటమాలజీ సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తుండగా.. సర్వే సాగని చాలా ఏరియాల్లో మెడిసిన్స్ ఇతరులకు చేరుతున్నాయి.

ఈ నెల మూడో తేదీ నుంచి జీహెచ్ఎంసీలో ఇంటింటి ఫీవర్ సర్వేను ప్రారంభించారు. మెడికల్​బృందాలను పర్యవేక్షించాల్సిన సర్కిల్​అధికారులు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. జీహెచ్ఎంసీలో 30 సర్కిళ్లు ఉండగా.. చాలా ఏరియాల్లో ఇంటింటి సర్వే చేస్తున్నట్టే తమకు తెలియదని స్థానికులు చెప్పుకుంటున్నారు. ప్రతీ రోజూ 700 బృందాలు 40 –50 వేల మధ్య కుటుంబాలను సర్వే చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ చెబుతోంది. అయితే అందులో ఎంతమందికి సాధారణ జ్వరం, కొవిడ్​ లక్షణాలు ఉన్నాయో ప్రకటించడం లేదు.

సర్వేలో పాల్గొన్న కుటుంబాల్లో ఎంత మందిని కొవిడ్​పరీక్షలకు తరలించారో లేదా.. అవసరమైన మెడిసిన్స్​అందించారో చెప్పేందుకు కూడా జీహెచ్ఎంసీ సాహసించడం లేదు. ఈ నెల 4న చేసిన సర్వే వివరాల ప్రకారం.. ఆ రోజు 40 వేల ఇండ్లల్లో సర్వే చేయగా.. 1,487 మందికి జ్వర లక్షణాలు ఉన్నట్టు గుర్తించి మందులు అందజేశారు. అదే రోజు ఆస్పత్రుల్లో 18 వేల మంది పరీక్షలు చేయించుకుంటే 3,600 మందికి జ్వర లక్షణాలు బయటపడ్డాయి. ఆ తర్వాత రోజు నుంచి ఈ గణంకాలను జీహెచ్ఎంసీ అధికారులు బహిర్గతం చేయడం లేదు.

ఒక రోజు సర్వే వివరాలను చూస్తే.. ఇంటింటి సర్వేలో సర్వే లక్షణాలు గుర్తించడంలో క్షేత్రస్థాయి సిబ్బందికి సాధ్యం కావడం లేదని తెలుస్తోంది. వారికి అవసరమైన నైపుణ్యం, పరికరాలు లేకపోవడం ఒక కారణం. అనుమానంతో ఆస్పత్రుల వద్దకు వచ్చిన వారిలో ఆరో వంతు జ్వర లక్షణాలను వైద్యులు గుర్తిస్తున్నారు. ఈ వైఫల్యం బయటపడుతుందనే బల్దియా అధికారులు వివరాలను దాస్తున్నారేమోననే విమర్శలు వస్తున్నాయి. ఇక సర్వే గణంకాలను దాచడం ద్వారా మెడికల్​కిట్లను పక్కదారి పట్టించడం సులభమవుతుంది.

సర్వే గణంకాల్లోనూ స్పష్టమైన వ్యత్యాసం..

గత సోమవారం నుంచి సర్వే ప్రారంభమైనప్పటికీ.. జీహెచ్ఎంసీలో మంగళవారం నుంచి సర్వే వివరాలను చెబుతోంది. మొదటి రోజు 393 సర్వే బృందాలే 1,035 కుటుంబాలను సర్వే చేశాయి. ఇక రెండో రోజు నుంచి 700 పైగా టీమ్స్ సర్వేలో పాల్గొంటున్నాయి. బల్దియా అధికారుల ప్రకటన ప్రకారం.. ఈ నెల 7 నాటికి (శుక్రవారం) వరకూ మొత్తం 1,82,924 కుటుంబాల ఫీవర్ సర్వే పూర్తి చేసినట్టు మొదటిసారిగా ప్రకటించారు. ఆ తర్వాత 8వ తేదీన 48,797, తొమ్మిదో తేదీన 41,192, పదో తేదీన సోమవారం 53,326, మంగళవారం (11వ) రోజు 51,884 కుటుంబాలను సర్వే చేసినట్టు వివరాలు వెల్లడించారు.

ఈ లెక్కన జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకూ 3,78,123 కుటుంబాలకు ఫీవర్​సర్వే పూర్తవుతుంది. కానీ అధికారులు మాత్రం 3,37,253 కుటుంబాల సర్వే పూర్తి చేసినట్టు చెబుతున్నారు. ఇలా సర్వే గణంకాల్లోనూ ఇష్టారీతిలో పేర్కొంటూ పని పూర్తయిందనేలా వ్యవహరిస్తున్నారు. ఇదే అదనుగా మెడిసిన్స్​పక్కదారి పడుతున్నట్టు తెలుస్తోంది. సర్వేలో భాగంగా జ్వర లక్షణాలు ఉన్నవారికి ఇవ్వాల్సిన మెడిసిన్స్‌ను తమకు తెలిసిన వారికి ఇస్తున్నారు.

కొవిడ్ లక్షణాల మెడిసిన్స్‌కు డిమాండ్​పెరిగిన నేపథ్యంలో మెడికల్​ఏజెన్సీలు, లోకల్​ వైద్యుల చేతుల్లోకి ఈ మెడిసిన్స్​చేరే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు పకడ్బందీగా, సమర్థవంతంగా ఫీవర్​సర్వే చేపట్టాల్సి ఉంది. లేదంటే ప్రజలకు ఉచితంగా అందాల్సిన రూ. లక్షల విలువైన ప్రభుత్వ మెడిసిన్స్ బ్లాక్​మార్కెట్‌కు తరలనున్నాయి. వాటిని కొనుగోలు చేసేందుకు పేద, మధ్య తరగతి కుటుంబాలు అధిక ధరల భారాన్ని మోయక తప్పదు.

Next Story