శిశు విహార్‌లో కరోనా ఐసొలేషన్ కేంద్రం ప్రారంభం

by  |
Corona Isolation Center
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొవిడ్ బారిన పడిన పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, మెడికల్ కిట్ అందించాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. గురువారం మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ లోని శిశు విహార్‌లో కరోనా పాజిటివ్ వచ్చిన పిల్లలకు చికిత్స అందించేందుకు ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. శిశు విహార్ లో పిల్లల ఆరోగ్య పరిస్థితులు, కొవిడ్ నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలు, కల్పిస్తున్న సౌకర్యాలను పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో అనేకమంది తల్లిదండ్రులు దాని కోరల్లో చిక్కుకుంటున్నారని, ఈ నేపథ్యంలో వారి పిల్లలను సంరక్షించేందుకు, చికిత్స అందించేందుకు ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. కొవిడ్ బారిన పడిన పిల్లలను వెంటనే చేర్చుకొని వారికి సకాలంలో మెరుగైన చికిత్స అందించేందుకు దగ్గర్లోని హాస్పిటల్స్, శిశు కేంద్రాలకు తరలించేందుకు వీలుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.

అనంతరం శిశు విహార్ లోని వార్డులను తిరుగుతూ… అక్కడి పరిస్థితులను సమీక్షించారు. పిల్లలకు కొవిడ్ సందర్భంగా ఇస్తున్న ఆహారం, స్టాక్ రూమ్ ను, కిచెన్ లోకి మంత్రి స్వయంగా వెళ్లి వంటకాలను పరిశీలించారు. చిన్నపిల్లలను పరిరక్షించేందుకు ఇటీవల ఏర్పాటు చేసిన చైల్డ్ హెల్ప్ లైన్ డెస్క్ కు వెళ్లి అక్కడికి వస్తున్న కేసులను పరిశీలించారు. కార్యక్రమంలో ఆ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య, శాఖ అధికారులు పాల్గొన్నారు.



Next Story