హుజూరాబాద్‌ బై‌పోల్‌ కౌంటింగ్‌లో కరోనా ఫీవర్

by  |
హుజూరాబాద్‌ బై‌పోల్‌ కౌంటింగ్‌లో కరోనా ఫీవర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్​ ఉప ఎన్నిక కౌటింగ్‌లో కరోనా భయం వెంటాడింది. ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో అధికారులు, ఏజెంట్లు పీపీఈ కిట్లతో దర్శనమిచ్చారు. ఆఫీసర్లు కూడా ఫుల్ ​ఫేస్​ మాస్కులను ధరించి వార్​ రూమ్‌కు వచ్చారు. కరోనా వ్యాప్తి చెందకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ప్రతి లెక్కింపు కేంద్రాల్లో మాస్కులు, పీపీఈ కిట్లను అందుబాటులో ఉంచారు. కరోనా నిబంధనలపై ఒక రోజు ముందుగానే సిబ్బందికి, ఏజెంట్లకు అవగాహన కల్పించినట్లు స్పష్టం చేశారు.

ముందస్తు జాగ్రత్తతోనే..

హూజూరాబాద్​ఉప ఎన్నిక నోటిఫికేషన్ ​వెలువడిన దగ్గర నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఆ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ప్రచారాలు, పార్టీలు, బహిరంగ సభలకు పెద్ద ఎత్తున హజరయ్యారు. వీరిలో 85 శాతం మంది మాస్కు, భౌతిక దూరాన్ని మరిచిపోయారు. దీంతో మొదట్నుంచి ఆ సెగ్మెంట్‌లో కరోనా భయం నెలకొన్నది. వైద్యాధికారులు పలు సార్లు అవగాహన కల్పించారు. అయితే ప్రస్తుతం వాతావరణ మార్పులతో చాలా మందికి దగ్గు, జలుబు వంటి కరోనా లక్షణాలు ఉండటంతో కలెక్టర్​ సూచన మేరకు కౌంటింగ్​ హాల్‌లోకి వచ్చే ఏజెంట్లు, అధికారులు, మాస్కు, భౌతిక దూరాన్ని పాటిస్తూ పీపీఈ కిట్లను ధరించారు. కాగా, ఆసుపత్రుల్లో కనిపించే పీపీఈ కిట్లు చాలా రోజుల తర్వాత కౌంటింగ్​ కేంద్రాల్లో కనిపించడంతో జనాలు కొద్ది సేపు కంగారు పడ్డారు. కేంద్రాల్లో ఏం జరుగుతుందంటూ అధికారులను ఆరా తీశారు.

Next Story

Most Viewed