కరోనా ఎఫెక్ట్.. ఓయూ క్యాంపస్ ఖాళీ !

by  |
కరోనా ఎఫెక్ట్.. ఓయూ క్యాంపస్ ఖాళీ !
X

దిశ, న్యూస్‌బ్యూరో:
తెలంగాణ రాష్ట్రంలోనూ, విద్యార్థి ఉద్యమ రాజకీయాలకు మేరు శిఖరం హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన క్యాంపస్ మొట్టమొదటిసారిగా బోసిపోయింది. పోలీసు నిర్బంధాలను, పారా మిలిటరీ దళాలు చుట్టూ మొహరించినా వెనుదిరగని విద్యార్థులతో ధిక్కార పతాకను గర్వంగా ఎగురవేసినా క్యాంపస్‌లో ఇప్పుడు వెతికి పట్టుకుందామన్నా ఒక్క విద్యార్థి కూడా దొరకని పరిస్థితి. విద్యార్థులు, అధ్యాపకులు, మేధావులు, నాయకులు చర్చలతో ఎప్పుడూ కళకళలాడే ఉస్మానియా క్యాంపస్ కరోనా దెబ్బకు కాకులు దూరని కారడవుల మధ్య ఖాళీ భవనాల సముదాయంగా మారిపోయింది.
అంతర్జాతీయ స్థాయిలోనూ, రాష్ట్ర విప్లవ, రాజకీయాల్లోనూ ఉస్మానియా పాత్ర అన్ని తరాలలో కనిపిస్తుంది. 1918లో ఏడో నిజాం నిర్మించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆనవాళ్లు ఏ చరిత్ర పుటలో వెతికినా దొరుకుతాయి. విశ్వవిద్యాలయం పరిధిలో 3 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటుండగా.. క్యాంపస్‌లో ఉండి చదివేవారిలో అండర్ గ్రాడ్యూయేషన్‌లో 10,308, పీజీలో 9,325 మంది, పీహెచ్‌డీ విభాగంలో 2,615 మంది మొత్తం 23,368 మంది బోర్డర్‌ హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు. వీరికి తోడుగా, రెంట్లు కట్టలేని వారు, వివిధ కారణాలతో నాన్- బోర్డర్లుగా క్యాంపస్‌లో ఉండేవాళ్లు వీరికి మూడింతలు పైగానే.. క్యాంపస్ కేంద్రంగా అనేక పోరాటాలు, విప్లవాలు అవతరించాయి. వామపక్ష నాయకులతో పాటు దేశానికి ప్రధానమంత్రిని అందించిన ఘనత కూడా ఉస్మానియా ఖాతాలో ఉంది. ఎందరో రాజకీయ, విప్లవ నాయకులను అందించిన క్యాంపస్ అనేక నిర్బంధాలను ఎదర్కుంది. కేంద్ర ప్రభుత్వ మిలటరీ దళాలు హాస్టల్ గదుల్లోకి వచ్చి విద్యార్థులను చితకబాదిన ఎవరు ఖాళీ చేయలేదు. తెలంగాణ ఉద్యమ సమయాలు, ఎమర్జెన్సీ నిర్బంధాలు ఎదుర్కున్నా.. క్యాంపస్‌లో ఎప్పుడూ వేల సంఖ్యలో విద్యార్థులు ఉండేవారు. బాష్పవాయు గోళాలు, లాఠీలు, ముళ్ల కంచెలు వేసి ఓయూలోని హాస్టల్ గదులు ఖాళీ చేయించాలని చూసినా ఏ ప్రభుత్వాలు 50శాతం కూడా సఫలం కాలేకపోయాయి. ముఖ్యమంత్రులను, ప్రధాన మంత్రులను ఎదురించి నిలబడినా.. ప్రభుత్వాలు నిరంకుశంగా విద్యార్థులపై అణచివేత ప్రదర్శించి, ఎన్నిరకాల ఒత్తిడి చేసినా ఓయూ ఒక్కరోజూ కూడా ఖాళీగా లేదు. ఆర్ట్స్ కాలేజీ ముందో, ఎన్‌సీసీ గేటు దగ్గరో, లైబ్రరీలోనో, లాండ్‌స్కేప్‌ పార్కులోనో, లైబ్రరీలోనో విద్యార్థులు గుంపులుగా చదువుకునేవారు. క్యాంపస్ విద్యార్థుల కంటే అధికంగా అక్కడి చెట్ల నీడ కోసం, ఆ వాతావరణంలో మంతనాలు జరిపేందుకు, చిన్న టీ కొట్ల వద్ద పిచ్చుకల గుంపులుగా జనాలు ఉండే వారు. సొంత గ్రామాల్లోని ఇంటి మరమ్మతుల నుంచి అంతర్జాతీయ నేతల రాజకీయాలు, మంత్రంగాలకు చర్చ వేదికగా ఉన్న ఉస్మానియాలో నేడు నిశ్శబ్ధ విప్లవం రాజ్యమేలుతోంది.

కరోనా దెబ్బకు ఎగిరిన పావురాలు

ప్రభుత్వ నేతలు గంటాపథంగా హెచ్చరించినా హాస్టళ్లు ఖాళీ అవలేదు. పోలీసు, మిలటరీ దళాలు హాస్టల్ గదులను సోదా పట్టినా ఎవరూ భయపడి ఇంటికి పోలేదు. ఎక్కడో ఒక చోట ఉంటామని ఆలోచన చేయలేదు. బోర్డర్, నాన్- బోర్డర్ తేడా లేకుండా వారికదే సొంత ఇల్లులాగా అతుక్కుపోయారు. జైళ్లోవేసినా, తీవ్రవాదులంటూ నేరాలు మోపి చెమడాలు వల్చినా క్యాంపస్‌లో అడుగుపెట్టినా ఏ ఒక్కడూ వదిలిపోలేదు. సందర్శకులు, విదేశీయులు, క్యాంపస్‌‌ భవనాలు, అక్కడి విద్యార్థులను చూసేందుకు వచ్చేవారితో జనసందోహంగా ఉండేది. తన 102 ఏండ్ల కాలంలో ఏ ఒక్క రోజులో వందల్లో మనుషులను చూడని క్యాంపస్ భవనాలు మనుషుల చప్పుడు వినడం లేదు. కాకి అరుస్తే కొట్టేందుకు మనిషి కూడా కనబడటం లేదు. మహా ప్రభుత్వ నేతలు, సుశిక్షితులైన ఆర్మీ, తుపాకులు, ముళ్ల కంచెలు చేయలేని పనిని ఒకే ఒక్క కరోనా చేసేసింది. చరిత్రలో ఎప్పడూ ఎవరూ ఊహించని ఖాళీ ఉస్మానియా క్యాంపస్‌ను మన ముందు నిలబెట్టింది.
లాక్‌డౌన్ నేపథ్యంలో తరగతులు నిర్వహించడం లేదు. హాస్టల్ మెస్‌ను కూడా మూసివేశారు. కర్ఫ్యూ విధించిన తర్వాత మొదట వారం రోజులే అనడంతో కొందరు ఉండేందుకు ప్రయత్నించారు. 21 రోజుల వాటు లాక్‌డౌన్ ప్రభుత్వం ప్రకటించడంతో అందరూ సొంతూళ్లకు బయలు దేరారు. విద్యార్థులతో పాటు నాన్- బోర్డర్లు సైతం ఇంటి బాట పట్టక తప్పలేదు. బోర్డర్ విద్యార్థులు వంట చేసుకునేందుకు ఎలాంటి అవకాశం లేదు. నాన్- బోర్డర్ల సహాయంతో ఉందామనుకున్నా స్థానిక పోలీసులు ఉండనివ్వడం లేదు. గుంపులుగా ఉండొద్దన్న కారణం చూపించి మార్చి 25 నుంచి స్థానిక పోలీసులు హాస్టల్ గదుల్లో వెతికి వెతికి ఖాళీ చేయిస్తున్నారు. 30 నాటికే దాదాపు వంద శాతం ఉస్మానియా విద్యార్థి హాస్టల్ గదులు ఖాళీ అయిపోయాయి. విద్యార్థి సంఘాల నాయకులు కూడా క్యాంపస్ దరిదాపుల్లో కనిపించకుండా పోయారు. కొందరు సొంతూళ్లకు వెళ్లగా.. మరికొందరు జాడ కూడా దొరకడం లేదు.


Next Story

Most Viewed