కొత్త పంథాలో స్టార్టప్స్.. 'మీట్' ఆన్ లైన్ డెలివరీ

by  |
chicken prices
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశంలో ఆన్​లైన్ ​డెలివరీల విప్లవం కొనసాగుతోంది. భవిష్యత్​లో ఏ అమ్మకమైనా ఆన్​లైన్​లోనే సాగే రోజులు ఎంతో దూరంలో లేవు. ఇప్పటి వరకు ఆన్​లైన్​ ఫుడ్​డెలివరీలు మాత్రమే ఉండగా.. తాజాగా మాంసాన్ని కూడా డెలివరీ చేసేందుకు పలు స్టార్టప్​ సంస్థలు పుట్టుకొచ్చాయి. ఇప్పటికే పదుల సంఖ్యల్లో యాప్స్ కూడా మార్కెట్లోకి వచ్చాయి. వాటిలో ప్రోటీన్స్, ఫ్రెష్​టు హోమ్, లీషియస్, ఫిపొలా, మస్తాన్, జాఫ్రెష్, టెండర్ కట్, బిగ్ బాస్కెట్, ఓన్లీ మీట్, రాయల్ చికెన్ లాంటి ఎన్నో ఆన్​లైన్ ​మీట్​ డెలివరీ సంస్థలు తమ యాప్​లను కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఒక్క సంస్థ ఒక్కో ఆఫర్ ప్రకటిస్తూ కస్టమర్లను తమవైపుకు లాక్కుంటున్నాయి. వినియోగదారులకు క్వాలిటీతో పాటు, హైజీన్ తో కూడిన మాంసాన్ని డెలివరీ చేస్తూ ఆదాయం సంపాదించడమే కాక, షాపు వరకు వెళ్లే కస్టమర్ల సమయాన్ని వృథా అవ్వకుండా చేస్తూ వారి మన్ననలు పొందుతున్నారు. దీంతో పాటు వారి బిజినెస్​ను సైతం క్రమంగా డెవలప్ చేసుకుంటున్నారు.

కొవిడ్ సమయంలో బయటకు వెళ్లి మాంసం కొనుగోలు చేయాలంటే ఎవరికి కరోనా ఉందో ఏమో అనే భయంతో విసిగి వేసారిన మాంసం ప్రియులకు ఆన్ లైన్​మీట్(మాంసం) డెలివరీ సంస్థలు కాస్త రిలీఫ్ ను ఇచ్చాయి. కస్టమర్లు కూడా షాపులకు వెళ్లి తమ సమయాన్ని వృథా చేసుకోకుండా ఆన్​లైన్​లోనే మాంసాన్ని కొనుగోలు చేసుకుంటున్నారు. క్రమంగా నగర ప్రజలు ఒక్కొక్కరుగా దీనికి అలవాటు పడిపోతున్నారు. మనకు నచ్చిన మాంసాన్ని ఆన్​లైన్​లో ఆర్డర్​ చేసిన గంట నుంచి గంటన్నర సమయంలోనే కస్టమర్లకు డెలివరీ చేస్తున్నారు. హైజీన్ తో కూడిన మీట్ ను వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. డెలివరీ సమయంలో బాయ్స్​కు కచ్చితంగా మాస్క్, శానిటైజర్, చేతులకు గ్లౌవ్స్​ ఉండేలా సంస్థలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

కరోనా కారణంగా జనజీవనం స్తంభించింది. ఎంతోమంది సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బిఫోర్​కొవిడ్.. ఆఫ్టర్​ కొవిడ్ ను చూస్తే పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. ఆన్​లైన్ మీట్ డెలివరీలు ఐదేళ్ల క్రితమే ప్రారంభమైనా.. ఈ సంస్థలకు కొవిడ్​కు ముందు ప్రతిరోజుకు 40 నుంచి 50 ఆర్డర్లు వస్తే కరోనా తర్వాత రోజుకు కనీసం 100 ఆర్డర్లు వస్తున్నాయి. ఇది క్రమంగా రెట్టింపవుతోంది. అయితే ఈ మాంసం ఎప్పటిదో ఇప్పుడు పార్సిల్​ చేస్తున్నారనే ఆందోళనలు కూడా కస్టమర్లలో ఉంది. మాంసాన్ని ఫ్రిడ్జ్‌లో నిల్వచేస్తారనే భయం ప్రజల్లో ఉంది. అయితే కస్టమర్లకు ఆ భయం అవసరం లేదని పలు సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఫ్రెష్ మీట్ నే పార్సిళ్ల ద్వారా సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నారు. ఫ్రోజెన్​ఫుడ్​అంటే ‌‌-18 డిగ్రీల వద్ద ఉంటుందని, దీనిద్వారా మాత్రమే మాంసం బాగా ఫ్రీజింగ్ అవ్వడం వల్ల మాంసం క్వాలిటీ దెబ్బతినడమే కాకుండా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు. కానీ తాము మాంసం చెడిపోకుండా ఉండేందుకు కేవలం 0-4 డిగ్రీల పర్టిక్యులర్ ​టెంపరేచర్​ వద్దే ఉంచుతామని వారు భరోసానిస్తున్నారు. దీనిని చిల్డ్​మీట్ అంటారని, దీనిద్వారా ఎలాంటి హెల్త్ ​ఇష్యూస్ కూడా ఉండవంటున్నారు నిర్వాహకులు.

మార్కెట్ లో ప్రతిరోజు చికెన్ ధరల్లో హెచ్చతగ్గులుంటాయి. ఇది అందరికీ తెలిసిందే. కానీ కొన్ని మీట్ డెలివరీ సంస్థలు ఫిక్స్​డ్ రేట్​ను పెట్టాయి. ఒక సంస్థ అయితే కేజీ చికెన్​కు రూ.240 కి అమ్మకాలు చేస్తోంది. మార్కెట్​లో చికెన్ ​ధర తగ్గినా అదే రేటు. పెరిగినా ఒకే రేటు ఉంటుంది. చికెన్​ధర తగ్గినప్పుడు కూడా ఇదే రేటులో కొనుగోలు చేసేవారికి కాస్త ఇబ్బందిగా మారినా ఫ్రెష్, హైజీన్ చికెన్​కోసం తప్పవనే భావన ప్రజల్లో ఉందని తెలుస్తోంది. ఇతర సంస్థలు బయటి మార్కెట్​తో పోల్చితే 10 శాతం అధిక ధరలకు డెలివరీ చేస్తోంది. చేపలపై 5 శాతం అధిక ధరలకు కస్టమర్లకు అందిస్తోంది. మటన్ పై మాత్రం మార్కెట్ రేటు ప్రకారమే ఇస్తోంది. మీట్​డెలివరీ సంస్థలకు చెందిన పలు బ్రాంచీలు పుప్పాలగూడ, ఎస్సార్ నగర్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, కావూరి హిల్స్, అయ్యప్ప సొసైటీ, మణికొండలో అధికంగా ఉన్నాయి.

కస్టమర్ల సేఫ్టీయే ముఖ్యం

కొవిడ్​తర్వాత ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెరిగింది. అందరూ నీట్​గా ఉండాలనే కోరుకుంటున్నారు. అందుకోసం కస్టమర్లు నేరుగా వెళ్లి కొవిడ్​బారిన పడకుండా ఉండేందుకు ఆన్​లైన్​కే ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. సేల్స్​కూడా గణనీయంగా పెరిగాయి. కస్టమర్లకు ఫ్రెష్​మాంసాన్ని, హైజీన్, కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ డెలివరీ చేస్తున్నాం. మా సంస్థలో ఎప్పుడూ ఒకే రేటు ఉంటుంది. ధర తగ్గినా, పెరిగినా రూ.240కి చికెన్​ను అందిస్తున్నాం. బిజినెస్​కూడా బాగా జరుగుతోంది. 32 శాతం గ్రాస్​తో బిజినెస్​చేస్తున్నాం.
= హరీశ్, ప్రోటీన్ ​మీట్ ​డెలివరీ సంస్థ నిర్వాహకుడు


Next Story

Most Viewed