చిరు ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ చారిటీ

by  |
చిరు ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ చారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై భారీ ప్రభావాన్ని చూపించింది. సినీ ఇండస్ట్రీ మూతపడేందుకు కారణమైంది. దీంతో చాలా మంది కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. కడుపు నింపుకునే అవకాశం, పని కోసం ఎదురుచూస్తున్నారు. ఈ కష్టాలను గమనించిన మెగాస్టార్ చిరంజీవి చిరు ఆలోచనతో ముందుకు వచ్చారు. సినీ కార్మికులకు అండగా ఉండేందుకు సి.సి.సి. మనకోసం( కరోనా క్రైసిస్ చారిటీ మనకోసం) సంస్థను ఏర్పాటు చేసేందుకు అంకురార్పణ చేశారు. ఈ విషయాన్నే ఓ వీడియో ద్వారా మీడియాకు తెలిపారు ప్రముఖ, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుల సంఘం అధ్యక్షులు ఎన్. శంకర్.

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా సృష్టిస్తున్న అల్లకల్లోలాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నామని… కరోనా ఎఫెక్ట్‌తో సినీ కార్మికులు ఇబ్బందులకు లోనవుతున్నారని తెలిపారు తమ్మారెడ్డి భరద్వాజా. ఇంతకు ముందు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మేము సైతం అంటూ హీరోలు, సినీ నిర్మాతలు, దర్శకులు సహాయం అందించేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. ప్రస్తుతం కూడా కరోనా మహమ్మారి దెబ్బతో అల్లాడుతున్న కార్మికులకు అండగా నిలిచారన్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి ఆధ్వర్యంలో సురేష్ బాబు, ఎన్. శంకర్, సి. కళ్యాణ్, దాము, నేను సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు.. సీసీసీ మనకోసం సంస్థ ద్వారా చిత్ర పరిశ్రమ కార్మికుల సంక్షేమార్థం చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీసీసీ మనకోసం చారిటీకి ఇప్పటికే చిరంజీవి రూ. కోటి, నాగార్జున రూ. కోటి, ఎన్టీఆర్ రూ. 25 లక్షలు విరాళం అందించినట్లు వెల్లడించారు. సమస్యలు ఎదుర్కొంటున్న సినీ కార్మికులను ఆదుకోవడమే చారిటీ ప్రథమ కర్తవ్యం అని…. ఇందుకు అందరూ సహకరించాలని సినీ ప్రముఖులకు పిలుపునిచ్చారు.

వేలాది మంది సినీకార్మికులకు అండగా నిలిచే లక్ష్యంతోనే సిసిసి మనకోసం సంస్థ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు దర్శకుల సంఘం అధ్యక్షులు ఎన్. శంకర్.. సంస్థ చైర్మన్‌గా చిరంజీవి వ్యవహరిస్తున్నారని తెలిపారు. తమ్మారెడ్డి భరద్వాజ, సురేష్ బాబు, సి. కళ్యాణ్, దాము, బెనర్జీ సభ్యులుగా ఉండగా… డెరెక్టర్ మెహర్ రమేష్, గీతా ఆర్ట్స్ బాబు, కోటగిరి వెంకటేశ్వర రావు, పరుచూరి గోపాలకృష్ణ, కొమరం వెంకటేష్, కార్మిక సంఘాల నాయకులు ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములుగా ఉంటారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రజలంతా కరోనాపై అద్భుత పోరాటం చేస్తున్నారని… తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సేవా కార్యక్రమానికి కేసీఆర్, కేటీఆర్, పోలీసు శాఖ సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తున్నామన్నారు.

Tags : Chiranjeevi, Tammareddy Bharadwaja, N. Shankar, CCC Manakosam

Next Story

Most Viewed