మహారాష్ట్రలో మళ్లీ ముదురుతున్న కరోనా.. ఒక్కరోజులోనే పదివేలకు పైగా కేసులు

by  |
corona cases rising in Maharashtra
X

దిశ, వెబ్‌డెస్క్: ఏడాదికాలంగా కంటి మీద కునుకులేకుండా చేస్తున్న మాయదారి మహమ్మారి కరోనా మహారాష్ట్రలో మళ్లీ పడగ విప్పుతున్నది. ఒకవైపు దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ కార్యక్రమం జరుగుతున్నా, దేశంలోని పలు రాష్ట్రాలలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. మహారాష్ట్రలో మాత్రం వైరస్ కోరలు చాచుతున్నది. గడిచిన 24 గంటల్లో అక్కడ 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తున్నది. నవంబర్ తర్వాత మహారాష్ట్రలో ఈస్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి.

వేగంగా వ్యాప్తి..

కరోనా కొత్త స్ట్రైయిన్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే మహారాష్ట్రలో 10,216 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 21 లక్షలు దాటింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా టెస్టుల సంఖ్యను కూడా పెంచుతున్నారు. గడిచిన 24 గంటల్లో అక్కడ 86,794 టెస్టులు నిర్వహించారు. ప్రస్తుతం అక్కడ 4,10,411 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు. 4,203 మంది ఆస్పత్రులు, క్వారంటైన్ కేంద్రాలలో చికిత్స పొందుతున్నారు.

మరో కఠిన లాక్‌డౌన్ తప్పదా..?

మహారాష్ట్రలో వైరస్ విజృంభణతో అక్కడ మరోమారు లాక్‌డౌన్ తప్పేలా లేదు. ఇప్పటికే ముంబయితో పాటు టైర్-2, టైర్-3 సిటీలలో లాక్‌డౌన్ నిబంధనలను అమలు చేస్తున్నారు. అమరావతి, ఔరంగాబాద్, జల్నా, యావత్మల్, పూణె, అకోలా వంటి జిల్లాలలో విధించిన పాక్షిక లాక్‌డౌన్‌నూ పొడిగించారు. కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో మరోసారి గతంలో విధించిన మాదిరిగా మరోసారి కఠిన లాక్‌డౌన్ తప్పకపోవచ్చునని నిపుణులు భావిస్తున్నారు.

ధారావిలోనూ దడదడ..

ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా ఉన్న ధారావిలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. గడిచిన పదిహేను రోజులుగా అక్కడ రోజుకు 50 కి తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో వైద్యాధికారులు, బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. గతంలో ధారావిలో కరోనా వైరస్‌ను కట్టడి చేసిన మోడల్‌నే మళ్లీ అమలుచేస్తున్నారు. ప్రతి ఒక్కరికి టెస్టులు, కరోనా కేసుల ట్రేసింగ్.. వంటి వాటితో ధారావిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.



Next Story

Most Viewed