కరోనా ఎఫెక్ట్: నేడో, రేపో బడులు బంద్?

by  |
Corona virus
X

బడులు మూతపడనున్నాయి. కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో పాఠశాలలను బంద్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకు విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీనిపై సీఎం కేసీఆర్ నేడో, రేపో ప్రకటన చేసే అవకాశం ఉంది. పలు జిల్లాల్లోని పాఠశాలల్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం గమనార్హం. విద్యార్థులు పాఠశాలల్లో గుమిగూడటం, కొవిడ్ నిబంధనలు పాటించకపోవడంతోనే కేసులు పెరుగుతున్నాయని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరినీ ప్రమోట్ చేయనున్నారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా మహమ్మారి దాడి ముమ్మరమవటంతో సోమవారం నుంచి పాఠశాలలు బంద్ చేయాలని విద్యాశాఖ యోచిస్తున్నది. 6 నుంచి 9 తరగతుల విద్యార్థులందరినీ పాస్ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. 10వ తరగతి మినహా అన్ని తరగతుల విద్యార్థులను పాస్ చేసి పై తరగతులకు ప్రమోట్ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు సీఎం కేసిఆర్ కు క్యాబినెట్ మీటింగ్ లో మంత్రి సబిత ఇంద్రారెడ్డి విద్యాశాఖ తరుపున ప్రతిపాదనలు అందించినట్టు సమాచారం. ఈ విషయాన్ని నేడో, రేపో అసెంబ్లీలో సీఎం కేసిఆర్ ప్రకటించే అవకాశముందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. పలు జిల్లాల్లో పదుల సంఖ్యలో విద్యార్థులకు కరోనా సోకగా ఓయూలో ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యంది.

భయం గుప్పిట బడులు

రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లోనే పలు సాంఘిక సంక్షేమ పాఠశాలలు, గురుకులాల్లో, కస్తూర్బా పాఠశాలల్లో విద్యార్థులకు కరోనా సోకింది. నాగర్ కర్నూలు జిల్లాలోని బీసీ బాలికల రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో ఇద్దరికి, రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట కస్తూర్భా బాలికల పాఠశాలలో 15 మంది విద్యా ర్థినులకు, జగిత్యాల భవానినగర్‌లోని సాంఘిక సంక్షేమశాఖ బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాలలో 20 మందికి బాలికలకు, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని కేజీబీవీలో 22 మందికి కరోనా సోకినట్టుగా ఆయా స్కూళ్ల ఉపాధ్యాయలు ప్రకటించారు. 15 రోజుల నుంచి కరీంనగర్, జగిత్యాల, హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో అధికంగా విద్యార్థులకు కరోనా సోకుతున్నది.

గడిచిన 24 గంటల్లో 313 కేసులు

గత వారం రోజుల నుంచి 200 వరకు ఉన్న కరోనా కేసులు ఒక్క సారిగా 300 పైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 313 కరోనా కేసులు నమోదైనట్టుగా ప్రకటించారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 47 కేసులు, రంగారెడ్డిలో 29 కేసులు, నిర్మల్ లో 25 కేసులు, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 20 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లిలో ఒక కేసు, మెదక్ లో ఒకటి, వరంగల్ రూరల్ లో 2, వనపర్తిలో 3, భద్రాద్రి కొత్తగూడెంలో 3 , ములుగులో 2 కేసులు నమోదయ్యాయి. నారాయణపేట జిల్లాలో ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,434 కేసులు యాక్టీవ్ గా ఉండగా ఇద్దరు మృత్యువాత పడ్డారు. 943 మంది హొం ఐసోలేషన్ లో ఉన్నారు.

పాఠశాలల ప్రారంభం కావడంతో పెరిగిన కేసులు

ఈ ఏడాది జనవరి వరకు పూర్తిగా కరోనా తగ్గుముఖం పట్టిన కరోనా పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థుల ద్వారా క్రమక్రమంగా కేసుల సంఖ్య పెరుగుతున్నది. కరోనా తగ్గిపోయిందన్న ఉద్దేశంతో ప్రభుత్వం 6 నుంచి 10 తరగతుల వరకు విద్యార్థులకు పూర్తి స్థాయిలో పాఠశాలలు ప్రారంభించింది. మొదట్లో తమ పిల్లలను బడికి పంపేందుకు తల్లిదండ్రులు ఇష్టపడలేదు. కరోనా కేసులు నమోదు కాకపోవడంతో తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. దీంతో హాజరు శాతం 70గా నమోదైంది. బడుల్లో పిల్లలందరూ గుమిగూడటంతో కొవిడ్ నిబంధనలు పాటించడం కష్టతరంగా మారింది. దీంతో కరోనా వ్యాధి వేగంగా విస్తరించింది. మార్చి 1న 116 కేసులు, మార్చి 8న 118 కేసులు నమోదు కాగా ఈ సంఖ్య మార్చి 19నాటికి 313కు పెరిగింది. గతేడాది డిసెంబర్ 1న 502 కేసులు నమోదకాగా డిసెంబర్ 29 నాటికి 397 కేసుల వరకు తగ్గుతూ వచ్చింది. ఇందుకు వ్యతిరేకంగా మార్చి మొదటి వారం నుంచి ఇప్పటి వరకు కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నది.

ఓయూలో పరీక్షలు యథావిధి

ఓయూలో పరీక్షలు యదావిధిగా కొనసాగుతాయని అధ్యాపకులు ప్రకటించారు. ఓయూ లేడీస్ హాస్టల్ లో ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్ ఉన్నట్టు తేలింది. దీంతో హస్టల్ లో కరోనా టెస్ట్ లు చేశాకే తర్వాతనే సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు విద్యార్థులు ధర్నా చేపట్టడంతో స్పందించిన అధ్యాపకులు పరీక్షలను వాయిదా వేయలేమని స్పష్టం చేశారు. కరోనా సోకిన ఇద్దరు విద్యార్థులకు మెరుగైన చికిత్సలు అందింస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల నుంచి 8వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు.

Next Story

Most Viewed