ఈటల ఎఫెక్ట్: ఏ క్షణంలోనైనా ఆ కానిస్టేబుళ్లు ట్రాన్స్‌ఫర్ అవ్వొచ్చు

by  |
Constables,-Huzurabad
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఈటల వ్యవహారం తెరపైకి వచ్చిన నాటినుంచి హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అధికారుల బదిలీలు జరుగుతూనే ఉన్నాయి. రెవెన్యూ, పోలీస్ డిపార్ట్‌మెంట్‌లనే టార్గెట్‌గా చేసి ట్రాన్స్‌ఫర్‌ల పర్వం కొనసాగిస్తున్నారు. తాజాగా.. మరికొన్ని గంటల్లో నియోజకవర్గంలోని పలు పోలీస్ స్టేషన్లలో బదిలీలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మూడేళ్లకు పైగా ఆయా పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్న కానిస్టేబుళ్ల జాబితాను సిద్ధం చేసిన పోలీసు అధికారులు ఏ క్షణంలో అయినా బదిలీ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. స్టేట్ బాసుల డైరెక్షన్‌లో ఈ తంతు అంతా గప్‌చుప్‌గా సాగుతోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న పోలీసు కానిస్టేబుళ్లను కూడా బదిలీ చేసి తీరాల్సిందేనన్న నిర్ణయానికి రావడంతో బదిలీలకు సంబంధించిన ఫైల్ చకాచకా కదలింది.

హుజూరాబాద్ అర్బన్, రూరల్, జమ్మికుంట అర్బన్ రూరల్ సర్కిళ్లలోని పీఎస్‌లలో పనిచేస్తున్న లాంగ్ స్టాండింగ్ పోలీస్ కానిస్టేబుల్స్ అందరినీ బదిలీ చేయనున్నారు. దీంతో ఆయా స్టేషన్లలోని సుమారు 300 మంది కానిస్టేబుళ్లు పెట్టే బేడా సర్దుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ పనిచేస్తున్న అధికారులందరినీ ఇప్పటికే బదిలీ చేయడంతో ఈటల మార్క్‌కు చెక్ పట్టే పని కూడా కంప్లీట్ అయిపోయిందని భావించారంతా. కానీ అనూహ్యంగా కానిస్టేబుళ్లకు సంబంధించిన బదిలీలు కూడా చేసేందుకు రంగం సిద్ధం చేయడం గమనార్హం. దీంతో హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్ని రకాల మార్పులు చేర్పులు ఉంటాయోనన్న చర్చ మొదలైంది.

ఆ ముసుగేసి మరీ..

అయితే.. హుజూరాబాద్ కేంద్రీకృతంగా జరుగుతున్న బదిలీలనే అపవాదును మూటగట్టుకోవద్దన్న ఆలోచనతో కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా బదిలీలు చేయాలని అధికారులు భావించారు. జిల్లావ్యాప్తంగా బదిలీల ప్రక్రియ సాధారణంగా జరిగేదే అనే భావన కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే కరోనా విలయ తాండవం చేస్తున్న సమయంలో ఉన్నట్టుండి ఒక్క కరీంనగర్‌లోనే ఈ బదిలీల ప్రక్రియ సాగుతుండడం వెనుక ఆంతర్యం ఏంటో అందరికీ తెలిసిందే.

Next Story

Most Viewed