టీఆర్ఎస్ కీలక నేత హత్యకు భారీ ప్లాన్.. భగ్నం చేసిన పోలీసులు..

by  |
plan
X

దిశ, సూర్యాపేట: సూర్యపేటకు జిల్లాకు చెందిన ఓ టీఆర్ఎస్ నాయకున్ని హత్య చేసేందుకు పన్నిన కుట్రను సూర్యాపేట పట్టణ పోలీసులు భగ్నం చేశారు. ముఠా సభ్యులను అదుపులోకి తీసుకొని వారి నుండి మరణాయుదాలను, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఘటనకు సంబంధించిన వివరాలను పట్టణ పోలీసు స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని సీతారాంపురం కాలనీలో ఒక రౌడీ షీటర్ ఇంట్లో గంజాయితో పాటు ముగ్గురు వ్యక్తులు అనుమానస్పందగా ఉన్నారన్న సమాచారం రావడంతో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ ఆంజనేయులు తన సిబ్బందితో కలిసి వెళ్లి ఆ ఇంటిపై దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారి వద్ద నుండి రెండు కేజీల గంజాయి, రెండు వేట గొడ్డళ్లు, ఒక కంకి కొడవలి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తులను విచారించగా వారి పేర్లను లింగంపల్లి సుధాకర్, లింగంపల్లి సంజయ్, అలువాల వెంకట స్వామి, పోతురాజు సైదులు‌గా తెలిపారు.

వారి వద్ద లభ్యమైన ఆయుధాల గురించి విచారించగా.. తమకు అడ్డుగా ఉన్న వ్యక్తిని చంపాలని కుట్రపన్ని ఆ మరణాయుధాలను సేకరించామని నిందితులను ఒప్పుకొన్నారు. అర్వపల్లి మండలానికి చెందిన టీఆర్ఎస్ జడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్, ముదిరాజ్ కులానికి చెందిన లింగంపల్లి జగన్నాధం రెండవ భార్య కూతురు మనీషా‌ను ప్రేమించి వివాహము చేసుకున్నాడు. దావుల వీరప్రసాద్ తన భార్యను ఎంపీపీ‌గా గత పర్యాయం గెలిపించుకున్నారు. కాగా కొద్దిరోజుల క్రితం జగన్నాధం అనారోగ్యముతో చనిపోయాడు. అయితే తలగొరివి పెట్టే విషయములో అందరూ జగన్నాధం పెద్ద భార్య కుమార్తె కవితతో తలగొరివి పెట్టించాలనుకున్నారు. దావుల వీరప్రసాద్ మాత్రం రెండవ భార్య కుమార్తె అయినటువంటి శ్వేతతో తలగొరివి పెట్టించాడు.

అప్పటి నుండి జగన్నాధం అన్న కొడుకు లింగంపల్లి సుధాకర్, అతని బంధువులకు, వీరప్రసాద్‌తో మనస్పర్ధలు వచ్చి గొడవలు జరుగుతున్నవి. గత కొద్ది రోజుల క్రితం జగన్నాధం పెద్ద భార్య అల్లుడు జిన్నే శ్రీను, అతని కుమారుడు అశ్విన్‌లపై మేకల సంతోష్‌ అనే వ్యక్తిని కొట్టిన విషయంలో దావుల వీరప్రసాద్ జిన్నే శ్రీను, అతని కుమారుడు అశ్విన్ లపై లేనిపోని తప్పుడు కేసులు పెట్టించాడని వారు కక్ష్య పెంచుకున్నారు. అలాగే లింగంపల్లి సంజయ్‌కు సంబంధించిన భూమి పంచాయితిలో దావుల వీరప్రసాద్ తలదూర్చి, అతనికి భూమి రాకుండా అడ్డుపడ్డాడనే అనుమానం ఉంది. దీంతో దావుల వీరప్రసాద్‌ను ఎలాగైనా చంపాలనుకున్నారు. సూర్యపేటకు చెందిన కిరాయి హత్యలు చేసే వారి బంధువైన లింగంపల్లి సంజయ్, రౌడీ షీటర్ పోతురాజు సైదులు‌లకు విషయం చెప్పగా వారు ఒప్పుకున్నారు.

దీనికి సంబంధించిన ప్లాన్ నవంబర్ 22న జనగాం చౌరస్తాలో ఉన్న కాకతీయ బార్‌లో జరిగింది. సుధాకర్, వెంకటస్వామి, పోతురాజు సైదులు, సంజయ్‌లు మందు తాగుతూ దావుల వీరప్రసాద్‌ను ఎలా చంపాలో చర్చించుకున్నారు. ఆ తరువాత సూర్యపేట పట్టణంలో ఫ్లై ఓవర్ పక్కన ఉన్న దుకాణంలో ఇనుప పనిముట్లు, రెండు కత్తులు, రెండు వేట కొడవళ్ళు కొనుగోలు చేశారు. పోలిసులకు సమాచారం రావడంతో వారిని పట్టుకొని కుట్రను భగ్నం చేశారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన టౌన్ సీ‌ఐ ఎ. ఆంజనేయులు, ఎస్సై శ్రీనివాస్, చివ్వెంల ఎస్‌ఐ విష్ణు, ఐ‌టి కోర్ ఎస్‌ఐ శివ కుమార్, క్రైమ్ స్టాఫ్ కృష్ణ, కర్ణాకర్, సైదులు, శ్రవణ్, మల్లేశ్ లను ఎస్పీ అభినందించి రివార్డ్‌లు ప్రకటించారు.


Next Story