రేవంత్ రెడ్డి బాటలో సీనియర్లు… ఓ కీలక మంత్రి టార్గెట్..!

by  |
రేవంత్ రెడ్డి బాటలో సీనియర్లు… ఓ కీలక మంత్రి టార్గెట్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేవరయాంజాల్​భూముల వ్యవహారంలో మంత్రి మల్లారెడ్డిని ప్రతిపక్ష కాంగ్రెస్​టార్గెట్​ చేసింది. గతంలో ఇదే అంశంలో మంత్రి కేటీఆర్‌ను ఎంపీ రేవంత్‌రెడ్డి లక్ష్యంగా చేసుకుని ఏకంగా జైలుకు వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు రేవంత్‌రెడ్డిని ఒంటరి చేసిన కాంగ్రెస్​పార్టీ కేటీఆర్​వ్యవహారంలో కలిసి రాకున్నా ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి అంశంలో మాత్రం రేవంత్‌రెడ్డి ఆరోపణలకు పార్టీ నుంచి సపోర్ట్​ వస్తోంది. ఇప్పటికే మాజీ ఎంపీ వీహెచ్​కొంత మద్దతు ఇస్తున్నట్లే మాట్లాడారు. ఇప్పుడు టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్​కూడా మంత్రి మల్లారెడ్డి భూ ఆరోపణలపై విమర్శలకు దిగుతున్నారు. అటు ఎన్ఎస్‌యూఐ శ్రేణులు కూడా అదే అంశాన్ని అందుకున్నాయి. ఆయన ఆస్పత్రిపై దాడి చేశారనే కేసులో 13 మందిపై కేసు కూడా నమోదు చేశారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రేవంత్‌రెడ్డి దగ్గర ఉన్న ఆధారాలతో కాంగ్రెస్​ శ్రేణులు ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు వ్యవహరిస్తున్నారు.

వెనక్కి తగ్గిన మంత్రి

దేవరయాంజాల్​భూములపై ఎంపీ రేవంత్‌రెడ్డి ముందస్తుగా స్పందించారు. మాజీ మంత్రి ఈటల వ్యవహారం సాగుతుండగానే ఈ భూములపై అధికార పార్టీ మీడియా నమస్తే తెలంగాణ రాసిన కథనాల ఆధారంగా అదే ప్రాంతంలో మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి ఇతర టీఆర్ఎస్​నేతలకు భూములు ఉన్నాయని, ఆ భూములు ఎలా చేతులు మారాయంటూ నిలదీశారు. అంతేకాకుండా కలిసి వచ్చిన వర్గాలతో దేవరయాంజాల్ భూముల్లో పరిశీలన చేశారు. ఆ ప్రాంతం కూడా రేవంత్‌రెడ్డి పార్లమెంట్​పరిధిలో ఉండటం కొంత అవకాశంగా మారింది. ఇదే సమయంలో ఓ టీవీ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎంపీ రేవంత్‌రెడ్డికి చాలా వివాదం సాగింది. ఆ మరునాడే అక్కడ తనకు భూములు లేవని, సవాల్‌కు సిద్ధమంటూ చెప్పుకొచ్చిన మంత్రి మల్లారెడ్డి ఆ తర్వాత ముఖం చాటేశారు. కానీ రేవంత్‌రెడ్డి వర్గం మాత్రం ఈ వివాదాన్ని కొనసాగిస్తూనే ఉంది.

కాంగ్రెస్‌కు అనుకూలంగా మారుతోందా?

కాంగ్రెస్​పార్టీ నుంచి ఒక్కొక్కరుగా దేవరయాంజాల్​భూముల వ్యవహారంలో రేవంత్‌రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతూ మల్లారెడ్డిని టార్గెట్​చేస్తున్నారు. అయితే ఇక్కడే కేటీఆర్‌కు కూడా భూములున్నాయనే ఆరోపణలున్నా కేటీఆర్​పేరెత్తకుండా కేవలం మల్లారెడ్డి లక్ష్యంగా విమర్శలకు దిగుతున్నారు. ఇది ఒక విధంగా కాంగ్రెస్​పార్టీ శ్రేణులకు కలిసి వస్తోంది. గతంలో కేటీఆర్​ఫాంహౌస్‌పై డ్రోన్​ అంశంలో రేవంత్​రెడ్డి జైలుకు వెళ్తే కనీసం పలుకరించే కాంగ్రెస్​నేత ఒక్కరూ లేరు. కానీ ఇప్పుడు కారణాలేమైనా మంత్రి మల్లారెడ్డి భూ కబ్జాల ఆరోపణలపై మాత్రం పార్టీ మొత్తం దూకుడుగా వ్యవహరిస్తోంది.

తాజాగా మంత్రి మల్లారెడ్డిపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సురారంలో మంత్రి మల్లారెడ్డి ఏడెకరాల చెరువు శికం భూమి ఆక్రమించారని, రెవెన్యూ రికార్డుల్లో ఉందని, అందులో మెడికల్ కాలేజ్ నిర్మించారని తెలిపారు. మల్లారెడ్డి కబ్జాపై ఎన్ఎస్‌యూఐ విద్యార్థులు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపగా వారిని అరెస్టు చేసి తప్పుడు కేసులు పెట్టి చర్లపల్లి జైలుకు పంపడం సరికాదన్నారు. పోలీసులు కబ్జాదారుల మాటలు వినొద్దని, మంత్రి మల్లారెడ్డి భూకబ్జాపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు కాంగ్రెస్​సీనియర్​నేత వీహెచ్​కూడా స్పందించారు. అటు ఎంపీ కోమటిరెడ్డి కూడా ఇటీవల రాసిన లేఖలో ఈ భూముల అంశాలను ప్రస్తావించారు. మొత్తంగా దేవరయాంజాల్​ భూముల వ్యవహారంలో మంత్రి మల్లారెడ్డి టార్గెట్‌ చేస్తూ కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా విమర్శలకు దిగడం, భూ కబ్జాలపై పోరాటం చేస్తామనడం విపక్ష పార్టీ నేతల్లో కొంత దూకుడు పెంచే విధంగా మారుతోంది.


Next Story

Most Viewed