కాంగ్రెస్ అధిష్టానంపై సొంత నేత సెటైర్లు

by  |
కాంగ్రెస్ అధిష్టానంపై సొంత నేత సెటైర్లు
X

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో ప్రక్షాళన జరగాలని పెన్నెత్తిన 23 మంది నేతల్లో ఒకరైన కపిల్ సిబల్… బిహార్ అసెంబ్లీ ఫలితాల్లో ఘోరపరాభవాన్ని మూటగట్టుకున్న సొంతపార్టీపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ప్రత్యామ్నాయంగా చూడట్లేదని, ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. పార్టీలో లోపాలను నాయకత్వం కావాలనే పట్టించుకోవట్లేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ను చుట్టుకుంటున్న సమస్యలు, వాటికి పరిష్కారాలు పార్టీ నాయకత్వానికి తెలుసు. కానీ, వాటిని గుర్తించి పరిష్కరించడానికి ససేమిరా అంటున్నదని విమర్శించారు.

‘కాంగ్రెస్‌లో సంస్కరణలు అత్యవసరమని, పార్టీ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని మాలో కొంతమంది లేఖ రాశాం. మా సూచనలు ఆలకించకుండా వారి వెన్ను చూపెట్టారు. వాటి ఫలితాలు ఇప్పుడు అందరి ముందున్నాయి. కేవలం బిహార్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఉపఎన్నికలు జరిగిన ప్రాంతాలన్నింటిలోనూ కాంగ్రెస్ పరిస్థితి స్పష్టమైంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభావవంతమైన ప్రత్యామ్నాయంగా ప్రజలు భావించడం లేదని అర్థమవుతున్నది. పార్టీ ఆత్మవిమర్శ చేసుకునే కాలమూ సమాప్తమైంది. సీడబ్ల్యూసీ సభ్యుడొకరు పార్టీ ఆత్మవిమర్శ చేసుకుంటుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.

ఆరేళ్ల నుంచి చేయని ఆత్మవిమర్శ, ఇప్పుడు చేస్తుందని ఎలా అనుకుంటాం? మనందరికి తెలుసు కాంగ్రెస్‌తో సమస్యేంటో.. వ్యవస్థాగతంగా పార్టీలో లోపమెక్కడుందో తెలుసు. వాటన్నింటికీ మనకు సమాధానాలు తెలుసు. కాంగ్రెస్‌కూ తెలుసు. కానీ, వాటిని గుర్తించదు. గుర్తించనంత కాలం దాని గ్రాఫ్ పడిపోతూనే ఉంటుంది. కాంగ్రెస్ ధైర్యం చేయకతప్పదు. ఈ భీతికి కారణం నామినేటెడ్ పద్ధతిని అవలంబించే సీడబ్ల్యూసీ బాడీ. దీనిస్థానంలో ప్రజాస్వామిక పద్ధతిని పాటించి సీడబ్ల్యూసీ సభ్యులను ఎన్నుకోవాలి. అలాగైతేనే, పార్టీలో అంతర్గత లోపాలను ఎత్తిచూపే వీలుంటుంది. నామినేట్ చేసిన సభ్యులు ప్రశ్నలడగడం కష్టమే’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Next Story