పినపాక కాంగ్రెస్ మండలాధ్యక్షుడి అరాచకం.. అధిష్టానం ఏం చేస్తున్నట్టు?

by  |
పినపాక కాంగ్రెస్ మండలాధ్యక్షుడి అరాచకం.. అధిష్టానం ఏం చేస్తున్నట్టు?
X

దిశ, మణుగూరు : ఉమ్మడి ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గంలోని పినపాక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అందరికీ తలనొప్పిగా మారాడని కార్యకర్తలు అంటున్నారు. రోజురోజుకూ అతని ఆగడాలు శృతిమించిపోతున్నాయి. మండల అధ్యక్షుడి వలన పార్టీకి ఒరిగేది ఏమీ లేదని కార్యకర్తలు చెబుతున్నారంటే అతని వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో చెప్పవచ్చు. ఒక్కరోజు కూడా అతను పార్టీ కోసం పని చేయలేదని, కాంగ్రెస్‌ను పూర్తిగా బ్రష్టు పట్టిస్తున్నాడని మండల కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు.

మండలంలో గుడిసె గుడిసెకు తిరిగి దందాలకు పాల్పడుతున్నాడని, అలాంటి వ్యక్తి పార్టీకి ఏవిధంగా పనికొస్తాడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా అతని పనిచేయకపోగా.. ఇతరులను పని చేసుకోనివ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని కార్యకర్తలు, నాయకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ములుగు ఎమ్మెల్యే సీతక్క ఫ్యాన్స్ ఫైర్..

పినపాక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా చెలామణి అవుతూ, దందాలకు పాల్పడే వ్యక్తి ములుగు ఎమ్మెల్యే సీతక్కను విమర్శి్స్తే ఊరుకునేది లేదని ఆమె ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క జోలికి వస్తే సహించేది లేదంటున్నారు. కాంగ్రెస్ పార్టీ బిక్షతో దందాలకు పాల్పడుతూ, డబ్బులు వెనకేసుకుంటున్న వ్యక్తి ఆ పార్టీ పెద్దల గురించి అసభ్యకరంగా మాట్లాడటం ఏంటనీ మండిపడుతున్నారు.అయితే, సీతక్క పినపాకలో పోటీ చేయదు.. ఆమె ఇక్కడికి రాదు.. వచ్చినా ఆమెకు ఓటు ఎవరూ వేయరనే మాటలు ఇంకొక్కసారి మాట్లాడితే ఊరుకునేది లేదని ములుగు ఎమ్మెల్యే అభిమానులు వార్నింగ్ ఇస్తున్నారు.

పార్టీకి యాక్టివ్ పర్సన్స్ దూరం..

పార్టీ కోసం యాక్టివ్‌గా పనిచేసే కొంతమంది నాయకులను పినపాక మండల అధ్యక్షుడు కావాలనే దూరం చేశాడని జోరుగా చర్చ నడుస్తోంది.
అందరూ తన మాట వినాలని, తన చెప్పుచేతల్లో ఉండాలని, ఎవరైనా తన దందాల గురించి ప్రశ్నిస్తే వారిని పార్టీ నుంచి తీసివేస్తున్నాడని కొందరు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల గురించి, పార్టీ ప్రాధాన్యత గురించి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా స్పందించే అచ్చ నవీన్ అనే వ్యక్తి ఎందుకు కాంగ్రెస్‌కు దూరం అయ్యాడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

సోషల్ మీడియాలో విలేకరులపై దుష్ప్రచారం

పొట్టకొస్తే అక్షరం ముక్కరాదు.. కనీసం పెన్ను పట్టి కాంగ్రెస్ పార్టీ అని రాయడం కూడా రాని వ్యక్తికి మండల అధ్యక్ష పదవి ఏ విధంగా ఇచ్చారని కొంతమంది సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. పార్టీ మీటింగుల్లో స్టేజ్ పైకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ గొప్పతనం గురించి మాట్లాడటం కూడా తెలియని వ్యక్తికి మండల అధ్యక్ష పదవి ఇవ్వడం దుర్మార్గమని కొందరు అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. నిజాన్ని నిర్భయంగా రాసే పత్రికా విలేకరులపై తన కోవర్టులతో చెడుగా రాయించి వాట్సాప్ గ్రూపుల్లో దుష్ర్పచారం చేస్తూ విలేకరులను కించపరుస్తున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు.

కాగా, మండల అధ్యక్షుడు దందాలకు పాల్పడితే పత్రికా విలేకరులు ప్రశ్నించడం తప్పా అని ప్రజలు, పార్టీ కార్యకర్తలు నిలదీస్తున్నారు. సమాజంలో జరిగే ఏ విషయాలనైనా ప్రజలకు తెలియపరిచే విలేకరులు దేవుళ్ళని, అలాంటి వారిపై చెడుగా ప్రచారం చేయడం తగదని పినపాక మండల అధ్యక్షుడిపై స్థానికులు నిప్పులు చెరుగుతున్నారు.

అధిష్టానం ఏం చేస్తున్నట్టు..

పినపాక మండల అధ్యక్షుడిపై అవినీతి ఆరోపణలు వస్తున్నా చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ అధిష్టానం ఏం చేస్తున్నట్టు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.పార్టీ పరువు తీస్తున్నా టీపీసీసీ ఉపాధ్యక్షుడు, భద్రాచలం ఎమ్మెల్యే పొదేం వీరయ్య, నియోజకవర్గ కన్వీనర్, కో-కన్వీనర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా అధిష్టానం మేల్కొని పినపాకలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోకుండా వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని, మండల అధ్యక్షుడుని పార్టీ నుంచి బహిష్కరించాలని కార్యకర్తలు, ప్రజలు, సీనియర్ నాయకులు కోరుతున్నారు.



Next Story

Most Viewed