పొలిమేర‌ దాకా త‌రిమికొట్టాలే.. కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్

by  |
Congress MP Revanth Reddy
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: వ‌రంగ‌ల్‌ను రెండో రాజ‌ధానిగా అభివృద్ధి చేయ‌డంలో సీఎం స‌న్నాసి కేసీఆర్ విఫ‌ల‌మ‌య్యాడ‌ని కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిప‌డ్డారు. రాష్ట్రం ఏర్పడ్డాక వ‌రంగ‌ల్‌లో ఎలాంటి అభివృద్ధి జ‌ర‌గ‌లేద‌ని అన్నారు. కాళోజీ క‌విత్వాన్ని, జ‌యశంక‌ర్‌ర సార్ స్ఫూర్తిని కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు ఎందుకు విస్మరించారో ప్రజ‌ల‌కు స‌మాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ పోరుగ‌ల్లుగా నిలిచిన వ‌రంగ‌ల్ జిల్లాకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిథ్యం వ‌హించ‌డ‌మంటే అంత‌కంటే ఈ జిల్లా ప్రజ‌ల‌కు ప‌ట్టిన దౌర్భాగ్యం మరోటి ఉండదని అన్నారు.

వ‌రంగ‌ల్ మున్సిపల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ప్రచారంలో పాల్గొన‌డానికి వ‌చ్చిన రేవంత్‌రెడ్డికి మ‌డికొండ వ‌ద్ద వ‌రంగ‌ల్ జిల్లా కాంగ్రెస్ నేత‌లు జంగా రాఘ‌వ‌రెడ్డి, నాయిని రాజేంద‌ర్‌రెడ్డి, న‌మిండ్ల శ్రీనువాస్ మడికొండ వ‌ద్ద ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా మ‌డికొండ జంక్షన్‌లో ప్రజ‌ల‌ను ఉద్దేశించి రేవంత్ ప్రసంగించారు. వ‌రంగ‌ల్ జిల్లా అభివృద్ధికి కాక‌తీయ టెక్స్‌టైల్ పార్కు, ఐటీ పార్కు తెస్తాన‌న్న కేసీఆర్ ఎందుకు ఇవ్వలేదో ప్రజ‌లు నిల‌దీయాల‌న్నారు. రాంపూర్, మ‌డికొండ ప్రజ‌ల ఆరోగ్యాల‌ను దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డును త‌ర‌లించ‌కపోవ‌డానికి కొంత‌మంది నేత‌లే కార‌ణ‌మ‌ని అన్నారు. నాటి యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిన కోచ్ ఫ్యాక్టరీని స్థాపించ‌క‌పోవ‌డంలో నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫ‌ల్యాలే కార‌ణ‌మని అన్నారు. తెలంగాణ‌లో కుస్తీ ప‌డుతూ… ఢిల్లీలో క‌మలం, కారు పార్టీలు దోస్తీ క‌డుతున్నాయ‌ని, జ‌నాలు కారు గుర్తుకు ఓటేసినా.. ఢిల్లీలో క‌మ‌లం గుర్తుకు అదీ చేరుతోందంటూ పేర్కొన్నారు.

బీజేపీ చిచ్చులు పెట్టి ఓట్లు సాధించాల‌నుకుంటోంది..

బీజేపీ రాష్ట్రంలో బ‌లం పెంచుకునేందుకు ప్రజ‌ల‌ను ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు, మతాల మధ్య చిచ్చులు పెట్టాల‌నుకుంటోంద‌ని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. జీహెచ్‌ఎంసీలో రాష్ట్ర ప్రభుత్వం వ‌ర‌ద సాయం అందించ‌డం లేద‌ని, తాము గెలిస్తే కేంద్రం నుంచి ఇప్పిస్తాన‌న్న బండి సంజ‌య్ ఎందుకు ఆ ప‌ని చేయ‌లేక‌పోతున్నారో ప్రజ‌ల‌కు చెప్పాల‌ని అన్నారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కేంద్ర హోంశాఖ ప‌రిధిలో ఉంటుంద‌ని, కేంద్ర హోం స‌హాయ మంత్రిగా ఉన్న కిష‌న్‌రెడ్డి ఎందుకు సాయం అందేలా చ‌ర్యలు తీసుకోవ‌డం లేద‌ని అన్నారు. కేవ‌లం ఓటు బ్యాంకు రాజ‌కీయాల‌కు పాల్పడుతున్నార‌ని అన్నారు.

2004 నుంచి 2014లోనే వ‌రంగ‌ల్ అభివృద్ధి..

వ‌రంగ‌ల్ జిల్లా, ప‌ట్టణాభివృద్ధంతా కూడా 2004 నుంచి 2014 వ‌ర‌కే జ‌రిగింద‌ని రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ వ‌చ్చాకా తొలిసారిగా సీఎం హోదాలో వ‌రంగ‌ల్‌లో ప‌ర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్‌దయ‌ల్‌, ల‌క్ష్మీన‌గ‌ర్‌, ఏఆర్ న‌గ‌ర్ వాసుల‌కు.. ‘‘డ‌బుల్ బెడ్‌రూం క‌ట్టిస్తా.. దావ‌త్ ఇవ్వాలె.. సార పోయాలె అన్నడు.. ఏడేండ్లవుతోంది.. కోడి ముదిరిపోయినా సార్ ఇల్లు క‌ట్టియ్యలే.. ఇటు వైపు రాలే’’ అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ చేసిన మోసాల‌ను ప్రజ‌లు గుర్తుకుపెట్టుకోవాలే అన్నారు. కాళోజీ నారాయ‌ణ‌రావు మాట‌ల్లోచెప్పాలంటే ప‌రాయోడు మోసం చేస్తే పొలిమేర‌ల దాక త‌రిమికొట్టాలే.. మ‌నోడే మోసం చేస్తే పాత‌రెయ్యలే అన్న విష‌యాన్ని ప్రజ‌లు యాదికి ఉంచుకోవాల అన్నారు.

Next Story

Most Viewed