‘కేటీఆర్ అలీబాబా.. అధికారులు అరడజను దొంగలు’

by  |
Revant Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోనే దండుపాళ్యం ముఠా తయారైందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్​రెడ్డి మండిపడ్డారు. సీఎస్‌తో పాటు కొంతమంది ఐఏఎస్ అధికారులను కలుపుకుని మంత్రి కేటీఆర్ దొంగల ముఠాను తయారు చేశారని ధ్వజమెత్తారు. కాలుష్యం పేరుతో పరిశ్రమలను తరలించి, రియల్​ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. గతంలో హైదరాబాద్ శివారు ఎల్బీనగర్ నుంచి పఠాన్‌చెరు వరకు ఏర్పాటు చేసిన పరిశ్రమలు నగరం పెరగడంతో నివాస ప్రాంతాల మధ్యలోకి వచ్చాయన్నారు. ఇదే అదునుగా ప్రభుత్వం భూ దందాకు దిగిందన్నారు. కాలుష్యం పేరుతో పరిశ్రమలను తరలించడానికి 2015లో ప్రత్యేక జీవో జారీ చేశారన్నారు.

ఆ ప్రదేశాలలో ఐటీ కంపెనీలు పెట్టేందుకే జీవో ఇచ్చారని, దీనికోసం భూ బదలాయింపు చట్టాన్ని తీసుకువచ్చారన్నారు. ఐటీ కంపెనీలకు భూములు ఇవ్వకుండా మంత్రి కేటీఆర్​నేతృత్వంలో రియల్​ఎస్టేట్​ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. కోటిన్నర స్క్వేట్​ ఫీట్లతో అపార్ట్​మెంట్లు నిర్మిస్తున్నారన్నారు. సీఎస్​ సోమేశ్​ కుమార్​, ఐఏఎస్‌లు అరవింద్​ కుమార్, జయేష్​ రంజన్,​లోకేష్​ కుమార్, టీఎస్​ఐఐసీ ఎండీ వెంకటనర్సింహారెడ్డితోపాటు కేటీఆర్ మిత్రుడు శ్రీధర్ ముఠాలో ఉన్నారని రేవంత్​రెడ్డి ఆరోపించారు. సీఎస్‌గా ఉన్న సోమేశ్​ కుమార్ రెరా చైర్మన్‌గా, సీసీఎల్ ఏ కమిషనర్‌గా ఉన్నారని, సీసీఎల్​ఏ కమిషనర్‌గా ఆయనే ప్రతిపాదనలు పెట్టి, రెరా చైర్మన్‌గా సంతకం పెడుతారని వెల్లడించారు. మిగతా అధికారులు కూడా ఇలాగే సహకరిస్తారన్నారు. కేటీఆర్ అలీబాబా అయితే అధికారులు, ఆయన స్నేహితుడు అరడజను దొంగలు అని అభివర్ణించారు. పరిశ్రమల భూములను ఐటీ కంపెనీల పేరిట తీసుకుని, బెంగళూరు, మంగుళూర్‌లో ఉన్న మిత్రులతో కేటీఆర్ సంస్థలను ఏర్పాటు చేసి కొనుగోలు చేయిస్తున్నారని ఆరోపించారు.

ఐటీఆర్‌ఎస్ తప్పంతా రాష్ట్రానిదే..

రాష్ట్రానికి ఐటీఐఆర్ రాకపోవడానికి మంత్రి కేటీఆరే కారణమని ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. 2018 నుంచి పట్టించుకోకుండా ఇప్పుడు కేంద్రంపై నెపం నెడుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ అసమర్థత వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదన్నారు. తమ తప్పేమీ లేదని టీఆర్ఎస్ ఎంపీ పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చిందని వివరించారు. ఐటీఐఆర్‌తో రూ.219 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేవని, 15 లక్షల మందికి ప్రత్యక్షంగా, 55.9 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి ఉండేదన్నారు. ఇక్కడ ఏం చేయలేని కేటీఆర్ విశాఖ ఉక్కు కర్మాగార ఉద్యమానికి మద్దతు పలకడం హాస్యాస్పదమని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలకు ముందే కేటీఆర్ విశాఖ వెళ్లాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. టీఆర్​ఎస్ తరపున వాణీదేవి పోటీ చేస్తుండటంతో పీవీ ఆత్మ క్షోభిస్తుందని, టీఆర్​ఎస్​ను ఓడించాలని, చిన్నారెడ్డిని గెలిపించాలని కోరారు.

Next Story

Most Viewed