కేసీఆర్‌కు మీ పవర్ చూపేందుకు ఇదే సరైన అవకాశం : జగ్గారెడ్డి

by  |
Congress MLA Jaggareddy
X

దిశ, నారాయణఖేడ్: మెదక్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిర్మలా జగ్గారెడ్డిని గెలిపించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అభ్యర్థించారు. ఆదివారం ఈ మేరకు నారాయణఖేడ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తదితర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటర్లతో ప్రత్యేకంగా సమావేశమై జహీరాబాద్ మాజీ పార్లమెంటు సభ్యులు సురేష్ షెట్కార్, పీసీసీ సభ్యులు డాక్టర్ సంజీవరెడ్డిలతో కలిసి మాట్లాడారు. స్థానిక నేతలకు మంత్రి హరీష్ రావు అపాయింట్మెంట్ ఇచ్చేవాడే కాదని ఎద్దేవా చేశారు. కానీ, కాంగ్రెస్ అభ్యర్థిని బరిలో పెట్టగానే అందరికీ ఫోన్లు చేస్తున్నాడన్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థిని ఎమ్మెల్సీగా గెలిపిస్తే కేసీఆర్ స్థానిక సంస్థల నాయకుల విషయంలో దిగివస్తారని స్పష్టం చేశారు. దిగిరావడమే కాదు స్థానిక నేతలు ఎంత ముఖ్యమో గమనించి నిధులు సైతం విడుదల చేస్తారని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో స్థానిక నేతలకు ఫుల్‌గా నిధులు మంజూరు అయ్యేవని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరూ రాజులాగా బతికారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్తేమి కాదన్నారు. దేశంలో, రాష్ట్రంలో, మెదక్‌లో కాంగ్రెస్‌దే చరిత్రన్నారు. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్‌కి ఎనిమిది స్థానాలు ఉండేవని తెలిపారు. నాందేడ్ రోడ్డు కాంగ్రెస్ హయాంలోనే మంజూరు అయిందన్నారు. మనకు ఉన్న 230 ఓట్లతో పాటు టీఆర్ఎస్ నేతలు ఎవరైనా వస్తే వారితోనూ ఓట్లు వేయించాలని కోరారు. వారి వెంట డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Next Story

Most Viewed