మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డూప్లికేట్ ఉద్యమకారుడు

by  |
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డూప్లికేట్ ఉద్యమకారుడు
X

దిశ, న్యూస్‌బ్యూరో: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. తన దగ్గర చిట్టా చాలా ఉందని, గౌడ సంఘం నాయకులకు ఆయన చరిత్ర అర్థం అయ్యేలా చెబుతానన్నారు. అటు.. టీజీవో నేతలపై మండిపడిన జగ్గారెడ్డి… తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన టీజీవో నేత ఏలూరి శ్రీనివాస్ ఎక్కడ పోయాడని ప్రశ్నించారు. టీజీవో సత్యనారాయణ, మమత, మంత్రి శ్రీనివాస్‌గౌడల సంగతి అంతా బయట పెడతానన్నారు. మమత భర్తకు పదవి విరమణ పొడిగింపునకు, గౌడ సంఘంకు ఏం సంబధముందన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ డూప్లికేట్ ఉద్యమకారుడని విమర్శించారు. నిజమైన ఉద్యమకారుడు స్వామిగౌడ్ అని, ఆయన నిబద్ధత కలిగిన నాయకుడని పొగిడారు. కరోనా కేవలం హైదరాబాద్‌కే పరిమితం అనుకున్నారు కానీ ఇప్పుడు జిల్లాలకు వ్యాప్తి చెందిందని చెప్పారు. ఆరోగ్యశాఖ మాత్రమే ఈటల దగ్గర ఉందని, పవర్ అంతా సీఎం దగ్గరే ఉందని, ఈటల కేవలం కరోనా కేసుల బులిటెన్ విడుదలకే పరిమితం అయ్యారని విమర్శించారు.

హైకోర్టు అంటే కూడా ప్రభుత్వానికి లెక్కలేదని, తెలంగాణలో అభివృద్ధి కాదని కరోనా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. తనపార్టీ అధికారంలో ఉంటే ఆరోగ్య శాఖ మంత్రిని సంగారెడ్డి ఆసుపత్రిలో పడుకోబెట్టే వాడినన్నారు. సంగారెడ్డి టౌన్‌లో ఒక్కరోజే 59కేసులు నమోదు అయ్యాయని, జిల్లా మంత్రి హరీష్‌రావు మాత్రం సంగారెడ్డికి వచ్చి కాంగ్రెస్ నాయకులను టీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. కరోనా వచ్చి తగ్గిన వారికి హరీష్‌రావు ఫోన్ చేసి మాట్లాడుతున్నారని, డబ్బులు ఖర్చు ఎంత అయ్యింది, నేను ఆదుకుంటానని మంత్రి హరీష్‌రావు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు.


Next Story

Most Viewed