రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు.. పార్టీ పెడతాం అంటూ హెచ్చరిక

by  |
Former-MLC-Prem-Sagar-Rao
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్టానంపై మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రోజుల్లో సమస్యలు పరిష్కరించాలని అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. శనివారం ఆయన మంచిర్యాలలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో కష్టపడి పార్టీ కోసం పని చేసే కార్యకర్తలను, నాయకులను నాయకత్వం విస్మరిస్తుందన్నారు. మొదటి నుంచి ఉత్తర తెలంగాణకు కాంగ్రెస్ నాయకత్వం అన్యాయం చేస్తోందన్నారు. గత ఇరవై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం కోట్లు ఖర్చు పెట్టి కష్టపడి పని చేశా అయినా నన్నెపుడు మోసం చేస్తూనే ఉన్నారన్నారని తీవ్ర విమర్శలు చేశారు. యువ నేత శ్రీధర్ బాబు లేదా జీవన్ రెడ్డికి పీసీసీ ఇవ్వాలంటే పట్టించుకోలేదన్నారు.

ఇంద్రవెల్లిలో సభ నిర్వహిస్తే.. ఒక్క రూపాయి ఇచ్చినోడు లేడన్నారు. ఉమ్మడి జిల్లాలో తనకున్న క్రెడిబిలిటీ పోవద్దనే ఉద్ధేశ్యంతో రూ.2 కోట్లు ఖర్చు చేసి సభ సక్సెస్ చేస్తే సభలో కొందరు తన పేరు కూడా ప్రస్తావించలేదన్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో మూడు వేల ఓట్లు వచ్చాయని.. ఇంత కంటే హీనమైన పరిస్థితి ఉందా.. ఇదంతా రేవంత్ రెడ్డి దయ.. అంటూ ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో 19 సీట్లు వచ్చాయని.. ఇలాగే వెళ్తే ఈ సారి ఒక్కరు కూడా గెలిచే పరిస్థితి లేదన్నారు. మాణిక్కం ఠాగూర్ ఒక ప్రిన్సిపాల్లా.. మేము ఎల్‌కేజీ పిల్లలం అనుకుంటాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి మూడు సార్లు బయటికి వెళ్లొచ్చిన సూట్ కేస్ నేత మాజీ మంత్రి వినోద్‌కు క్రమశిక్షణ కమిటీలో చోటిస్తే.. పార్టీలో ఎవరైనా ఉంటాడా.. అని అన్నారు.

ఏదైనా కష్టమొస్తే అధ్యక్షుడికి ఫోన్ చేద్దామంటే ఏ ఫోన్‌లో ఉంటాడో తెలియదని.. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి నంబర్ కూడా నా దగ్గర లేదన్నారు. అధిష్టానానికి మూడు రోజుల సమయం ఇస్తున్నామని.. కమిటీల్లో నుంచి పక్కన పెట్టిన కార్యకర్తల విషయంలో నష్ట నివారణ చర్యలు చేపట్టకుంటే ప్రత్యేక పార్టీ పెడతామన్నారు. ఇందిరా కాంగ్రెస్ పేరుతో ముందుకు వెళ్తామని పేర్కొన్నారు.

Next Story

Most Viewed