ఎమ్మెల్సీ ఎన్నికలు.. ‘పని’కి రాని ‘హస్తం’ నేతలు

by  |
Congress
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం, వరంగల్, నల్లగొండ స్థానాన్ని ఎలాగైనా గెలవాలని అన్ని ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులే కాకుండా పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృతంగా తిరుగుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీరాములు నాయక్ మాత్రం నామమాత్రంగానే ప్రచారం నిర్వహిస్తున్నారని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలే చర్చించుకోవడం గమనార్హం. ఈ ఎన్నిక ఫలితాల ప్రభావం వచ్చే కార్పొరేషన్ ఎన్నికలపై స్పష్టం కనిపిస్తుందని.. అయినా అలసత్వం ప్రదర్శించడం తగదంటున్నారు హస్తం కార్యకర్తలు.

పట్టించుకునే వారేరి..

ఖమ్మం కేంద్రంలో ఇటీవల జరిగిన అన్ని జిల్లాల డీసీసీ సభ్యుల సమావేశానికి రాష్ట్రస్థాయి నేతలు హాజరుకావడం, మీటింగ్ కూడా సక్సెస్ కావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు, ద్వితీయస్థాయి నేతల్లో జోష్ పెరిగింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క్ అన్నీ మీదేసుకుని నేతలందరినీ ఏకం చేశారు. ఇక తమ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని అనుకున్న హస్తం కాడర్.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి ఎవరూ రాకపోవడంతో నిరాశ చెందుతున్నారు. భట్టి విక్రమార్క ఇన్ని రోజులూ రైతు పాదయాత్ర చేయడంతో జిల్లా నేతలెవరూ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి ఆసక్తి కనబర్చడం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీ అభ్యర్థి గెలుపు పక్కన పెడితే.. ఆశించిన స్థాయిలో ఓట్లు రాకుంటే పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లోనే తలెత్తుతోంది.

దూసుకుపోతున్న అధికార పార్టీ అభ్యర్థి..

అధికార పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇప్పటికే విస్తృత ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు. టీఆర్ఎస్ తరఫున మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామానాగేశ్వరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మె్ల్యేల సహాయంతో నియోజకవర్గాల వారీగా ప్రచారం చేస్తున్నారు. పార్టీ శ్రేణులను సైతం పల్లా గెలుపుకోసం కృషి చేయాలని కోరుతున్నారు. వారు తలపెట్టిన అన్ని కార్యక్రమాలకు యువత కూడా భారీ స్థాయిలో హాజరు కావడంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు ఖాయంగానే చెపుతున్నారు ఆ పార్టీ నేతలు.

ఎవరికి వారు గెలుపు ధీమాలో..

ఖమ్మం, నల్లగొండ, వరంగల్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని బీజేపీ అభ్యర్థి సైతం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. యువ తెలంగాణ అభ్యర్థి రాణి రుద్రమ, తెలంగాణ జనసమితి అభ్యర్థి కోదండరామ్, వామపక్షాల అభ్యర్థి జయసారథి, ఇంటి పార్టీ అభ్యర్థిగా చెరుకు సుధాకర్‌తో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే వీరికి కూడా పట్టభద్రులు మద్దతిస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు వీరు కూడా దూకుడు మీదుండడంతో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ప్రచారంలో వస్తున్న రెస్పాన్స్ ను బట్టి ఎవరికి వారు గెలుపు ధీమాలో ఉన్నారు. వీటికి తెర పడాలంటే ఎన్నికల రిజల్ట్ వరకు వేచి చూడాల్సిందే అంటూ రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.


Next Story

Most Viewed