వాళ్లది ఢిల్లీలో దోస్తీ , గల్లీలో కుస్తీ రాజకీయం : తుంకుంట నర్సారెడ్డి

by  |
వాళ్లది ఢిల్లీలో దోస్తీ , గల్లీలో కుస్తీ రాజకీయం : తుంకుంట నర్సారెడ్డి
X

దిశ, గజ్వేల్ : దళిత బంధు పథకాన్ని నిర్వీర్యం చేయడంతోపాటు రైతులను మభ్యపెట్టేందుకే టీఆర్ఎస్, బీజేపీలు ఆందోళనలు చేపట్టాయని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి, రాష్ట్ర ప్రొఫెషనల్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ డాక్టర్ శ్రావన్ కుమార్ రెడ్డి లు విమర్శించారు. శుక్రవారం గజ్వేల్ లో అంకిరెడ్డి పల్లి కి చెందిన పల్పనూరి ప్రభాకర్ రెడ్డికి జిల్లా కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ గా నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ పడుతున్న బీజేపీ, టీఆర్ఎస్ నేతలను ప్రజలు విశ్వసించరని ఎద్దేవా చేశారు. అలాగే రైతుల ఆందోళన ఫలితంగా కేంద్రం దిగిరాక తప్పలేదన్నారు. ఇప్పటికైనా ప్రధాని మోది అన్నదాతల ఆందోళన అర్థం చేసుకుని వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం రైతుల విజయంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో కొనుగోలు చేయడం లేదని దీంతో అన్నదాతలు బజారున పడుతుండగా ధాన్యం నీటి పాలవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

ధాన్యం కొనుగోలు పై సీఎం కేసీఆర్ హామీలు ప్రకటనలకే పరిమితం అవుతుండగా గ్రామాల్లో మాత్రం కొనుగోలు కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉన్నట్లు ఆరోపించారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసే విధంగా కాంగ్రెస్ రాష్ట్ర సర్కారుపై ఒత్తిడి తెస్తుందని, ఇందులో భాగంగానే కల్లాలకు కాంగ్రెస్ పేరిట పాదయాత్రలు చేపట్టి రైతులను చైతన్యం చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని దళితులందరికీ దళిత బంధు పథకాన్ని వర్తింపజేయాలని, లేనిపక్షంలో వారే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఎన్నికలు రాగానే సీఎం కేసీఆర్ కు కొత్త హామీలు గుర్తుకు వస్తాయని, ఎన్నికలు ముగిసిన వెంటనే ఆ హామీలు మర్చిపోతున్న కేసీఆర్ కు ప్రజలు సరైన రీతిలో జవాబు చెప్పనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, మెదక్ జిల్లా ఐఎన్టియుసి అధ్యక్షులు వసిక శ్రీకాంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్, నేతలు అనిల్ గౌడ్, చింత వెంకట్, దినాకర్, కరుణాకర్, కిషన్, రవి, సుధాకర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.



Next Story