కాంగ్రెస్‌లో తూర్పు, పడమర.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెరో దిక్కు

by  |
కాంగ్రెస్‌లో తూర్పు, పడమర.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెరో దిక్కు
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆయన ఔనంటే.. ఈయన కాదంటారు.. ఈయన కాదంటే.. ఆయన ఔనంటారు.. తూర్పు, పడమర దిక్కులు కలవని మాదిరిగా.. కాంగ్రెస్ పార్టీలోని తూర్పు, పడమరకు చెందిన ఇద్దరు కీలక నాయకులు చెరో దిక్కు పయనిస్తున్నారు.. తాజాగా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికల వేళ ఇద్దరు నేతలు తూర్పు, పడమర మాదిరిగానే విభిన్న వాదనలు వినిపిస్తున్నారు.. అధికార పార్టీ అభ్యర్థిని ఓడించేందుకు తమ పార్టీ ఓటర్లంతా స్వతంత్ర అభ్యర్థికి ఓటేయాలని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెబుతుండగా.. ఓటింగులో కాంగ్రెస్ ఓటర్లు పాల్గొనకూడదని, ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేంసాగర్ రావు ప్రకటించారు.

దీంతో ఒకే పార్టీకి చెందిన తూర్పు, పడమర నాయకులు భిన్న దిక్కులా.. విభిన్న వాదనలు వినిపించటంతో పార్టీకి చెందిన ఓటర్లలో గందర గోళం నెలకొంది. అధికార పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెసు పార్టీతో పాటు విపక్ష ఓటర్లు, అధికార పార్టీలోని అసంతృప్తి ఓటర్లంతా స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇచ్చేలా మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెర వెనకుండి చక్రం తిప్పుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదివాసీ మహిళ పెందూరు పుష్పారాణికి అండగా నిలిచేలా పావులు కదుపుతున్నారు. పార్టీలకతీతంగా ఓటర్ల మద్దతు కూడగడుతుండగా.. ఇప్పటికే ఫోన్లు చేసి మాట్లాడినట్లు తెలిసింది.

మంత్రి అల్లోలతో దూరం పెరిగిన నేతలు ఏలేటి మద్దతుతో క్రాస్ ఓటింగుకు ప్రయత్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఏలేటి టీఆర్ఎస్ ఓటర్లతోనే క్రాస్ ఓటింగ్ చేయించే ప్రయత్నాలు చేస్తుంటే.. ఇక తూర్పు ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రకటన సొంత పార్టీ ఓటర్లలో గందరగోళానికి దారి తీస్తోంది. ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరగకూడదనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఓటింగుకు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించటంలో ఆంతర్యమేంటో అర్థం కావటం లేదని పార్టీలోనే చర్చ సాగుతోంది.

మొదటి నుంచి మాజీ ఎమ్మెల్యే ఏలేటి, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల మధ్య విబేధాలు ఉన్నాయి. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ రెండు గ్రూపులుగా చీలిపోయింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని బరిలో పెట్టకుండా.. కొందరు నామినేషన్లు వేశాక వెనక్కి తీసుకున్నారు. స్థానిక ఎన్నికల్లో బలం లేనందునే.. పోటీలో పెట్టలేదని చెబుతుండగా.. తాజాగా ఇద్దరు తూర్పు, పశ్చిమ కీలక నాయకులు భిన్న దిక్కుల్లాగే విభిన్న వాదనలు వినిపించటం మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది.

Next Story

Most Viewed