బీజేపీకి డిపాజిట్ కూడా రాదు : ఉత్తమ్

by  |
Uttam Kumar Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై టీపీసీసీ ప్రెసిడెంట్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మంగళవారం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ… ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌ ఇద్దరూ కలిసి తెలంగాణ రైతుల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. అంతేగాకుండా బీజేపీ-టీఆర్ఎస్ రెండు పార్టీలు చీకటి ఒప్పందం కుదుర్చుకొని, రైతుల జీవితాలను ఆగం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని, రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నాకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో కేసీఆర్ దుర్మార్గ, దౌర్భాగ్య పాలన చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో పంట ఉత్పత్తులు కొనుగోలు చేసే వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రూ.10 లక్షల కోట్ల బడ్జెట్‌లో రైతుల కోసం కేవలం ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టలేరా..? అని ప్రశ్నించారు. రైతుబంధు.. పంట భీమా ఏమైందన్నారు. ‘గల్లీ మే కుస్తీ.. ఢిల్లీ మే దోస్తీ’ అన్నట్లుగా బీజేపీ, టీఆర్ఎస్ వ్యవహారం ఉందన్నారు. నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని, బీజేపీకి డిపాజిట్ కూడా రాదని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.


Next Story

Most Viewed