విధుల్లోకి తీసుకోకపోతే ఊరుకోం.. ఎమ్మెల్యే చల్లాకు కాంగ్రెస్ నేత వార్నింగ్

by  |
Congress-leader1
X

దిశ, ఆత్మకూర్: ఆత్మకూరు గ్రామ అభివృద్ధికి అనుక్షణం పాటుపడుతూ, నిత్యం ప్రజల సేవే పరమావధిగా పనిచేస్తున్న సర్పంచ్ పర్వతగిరి రాజుపై ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కుట్రలు చేసి సస్పెండ్ చేయించారని, గ్రామ అభివృద్ధికి పాటుపడితే సస్పెండ్ చేస్తారా అని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కమలాపురం రమేష్ ప్రశ్నించారు. శనివారం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కమలాపురం రమేష్ మాట్లాడుతూ ఆత్మకూర్ గ్రామ సర్పంచ్ పర్వతగిరి రాజు గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారని, గ్రామ పంచాయతీ ఆవరణలో కాంప్లెక్స్ నిర్మాణం చేశారని, అదే విధంగా మెయిన్ రోడ్డు ప్రక్కనే 20 గుంటల భూమిని సేకరించి పల్లె ప్రకృతి వనం నిర్మించి ఆదర్శంగా నిలిచారన్నారు. మండలంలో హౌజ్ బుజుర్గ్, నీరుకుల్లా గ్రామాల నిధుల దుర్వినియోగంపై ఆ సర్పంచులపై చర్యలు తీసుకొని అధికారులు, ఆత్మకూర్ గ్రామ అభివృద్ధికి పాటుపడే సర్పంచ్ పర్వతగిరి రాజుపై మాత్రం చర్యలు తీసుకోవడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. గ్రామంలో గ్రామసభ నిర్వహిస్తే సర్పంచ్ రాజు విషయంలో ప్రజలే సమాధానం చెబుతారన్నారు. అధికార బలంతో అక్రమ కేసులు బనాయించడం సరికాదన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులను సర్పంచులు గ్రామంలో ఉన్న పరిస్థితులను బట్టి ఖర్చు పెడుతున్నారని, ఇది ఏ విధంగా అక్రమం అవుతుందని తిరుపతి ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్న సర్పంచ్ రాజును విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఆత్మకూర్ పీఏసీఎస్ చైర్మన్ ఏరుకొండ రవీందర్, గుడేప్పాడ్ ఎంపీటీసీ రజినీకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పరికిరాల వాసు, మాజీ సర్పంచ్ నాగెల్లి సామెల్, గ్రామ పార్టీ అధ్యక్షులు చిదురాల శ్రీనివాస్ రెడ్డి, భయ్యా కుమారస్వామి, మత్స్య శాఖ అధ్యక్షుడు బయ్య తిరుపతి, సొసైటీ డైరెక్టర్ వీర్ల వెంకటరమణ, వార్డు సభ్యులు కాడ బోయిన రవి, నాయకులు అల్వాల రవి, శ్యామ్, పరికరాల వాసు, చిమ్మని దేవరాజు, తనుగుల సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed