మనిషి అక్కడ.. పదవి తెలంగాణలోనా.. TRS ఎమ్మెల్యేపై సంచలన వ్యాఖ్యలు

by  |
AAdi-srinivas
X

దిశ, వేములవాడ : భారత దేశంలో పౌరసత్వం ఉందంటూ మోసపూరితమైన మాటలు చెబుతూ, పబ్బం గడుపుతూ వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆది శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. 17 నెలల తర్వాత జర్మనీ నుంచి వేములవాడకు వచ్చిన ఎమ్మెల్యే రమేష్ బాబు ఇక్కడున్న ప్రజలపై ప్రేమతో వచ్చానని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. నియోజకవర్గంలోని ప్రజల బాగోగులను, అభివృద్ధి విషయాన్ని ఆయన ఏ రోజూ పట్టించుకోలేదని దుయ్యబట్టారు.

మనీ, మనసు, మమకారంతో పాటు పౌరసత్వాన్ని జర్మనీలో నిలబెట్టుకున్న నాయకుడు రమేష్ బాబు అని ఫైర్ అయ్యారు. కరోనా కష్ట కాలంలో నియోజకవర్గంలోని ప్రజలందరూ ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, ఎమ్మెల్యే జర్మనీలో కాలం వెళ్లదీశాడని అన్నారు. 17 నెలల తర్వాత వచ్చి వేములవాడ నియోజకవర్గ ప్రజలపై కొత్త ప్రేమ ఒలకబోస్తున్నారనీ, 17 నెలలుగా నియోజకవర్గానికి దూరంగా ఉన్నందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

భారత దేశ పౌరుడు అంటున్న రమేష్ బాబు ఎందుకు జర్మనీ దేశ పాస్‌పోర్ట్‌పై ఆ దేశానికి ఎందుకు వెళ్తున్నాడో సూటిగా ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. ఇటీవల సిరిసిల్లలో సీఎం కేసీఆర్ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి హామీ ఇచ్చారు అంటున్నారు కానీ.. 6 ఏళ్ల క్రితం ఇచ్చిన 450 కోట్ల హామీ ఏమైందో సమాధానం ఇవ్వాలన్నారు. కథలాపూర్ మేడిపల్లి మండలంలో రైతుల వర ప్రదాయిని అయిన కలికోట సూరమ్మ కుడి ఎడమ కాల్వల పనులు ఇంకా మొదలు కాలేదు.. అది ప్రభుత్వం వైఫల్యం కాదా అని ప్రశ్నించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సంఘ స్వామి యాదవ్, జిల్లా కార్యదర్శి చిలుక రమేష్, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, అరుణ్ తేజ చారి, చిలివేరి శ్రీనివాస్, పాత సత్య లక్ష్మి, మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు తోట లహరి, పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, ఉపాధ్యక్షులు వస్తాది కృష్ణ, కార్యదర్శి గేంటల ప్రకాష్, సాబీర్ కోలకాని రాజు, దూలం భూమేష్ గౌడ్, తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed