కేసీఆర్ వాళ్ల కాళ్లు పట్టుకున్నారు : షబ్బీర్ అలీ

by  |
కేసీఆర్ వాళ్ల కాళ్లు పట్టుకున్నారు : షబ్బీర్ అలీ
X

దిశ, కామారెడ్డి: దేశానికి కాంగ్రెస్ 60 ఏళ్ల కాలంలో ఏమి చేసిందో చాయ్​ వాలా మోడీకి ఏం తెలుసని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి కాంగ్రెస్​ పార్టీ ఏం చేసిందో ప్రజలకు తెలుసని, ఢిల్లీలో గడ్డకట్టే చలిలో వంద మంది రైతులు చనిపోతే మోడీ పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు చట్టాల విషయంలో ఊసరవెల్లిలా యూ టర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. కామారెడ్డి కలెక్టరేట్ ధర్నాచౌక్ వద్ద సోమవారం రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా, ఢిల్లీ రైతులకు మద్దతుగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ రైతుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే విధంగా ప్రవర్తిస్తున్నాయన్నారు.

రైతులకు నష్టం కలిగించే చట్టాలను వ్యతిరేకించాల్సిన సీఎం వాటికి జై కొడుతున్నారని విమర్శించారు. అకాల వర్షాలతో లక్షలాది ఎకరాల్లో పంటలు నష్టపోయినా ఒక్క రూపాయి కూడా పరిహారం అందించలేదన్నారు. కొనుగోలు కేంద్రాలు ఎత్తేసి రైతులను రోడ్డున పడేశారన్నారు. జైలుకు పోవడం ఖాయమని ఇక్కడి బీజేపీ నాయకులు చెప్పగానే భయపడిన కేసీఆర్ ప్రత్యేక విమానంలో హుటాహుటిన ఢిల్లీ వెళ్లి నేరుగా మోడీ, అమిత్ షాల కాళ్లు పట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం నీళ్లు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ప్రాంతాలకు మాత్రమే ఇస్తారా? కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు మీకు ఓటేయలేదా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను బొంద పెట్టే వరకు విశ్రమించేది లేదన్నారు. అంతకు ముందు ఢిల్లీలో చనిపోయిన రైతుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ధర్నాలో డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజక వర్గాల ఇన్​చార్జిలు కాసుల బాలరాజు, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Next Story