ఇది భ్రమల బడ్జెట్ : షబ్బీర్ అలీ

by  |
Congress leader Shabbir Ali
X

దిశ, కామారెడ్డి: రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను తప్పుదోవపట్టించేలా ఉందని, పూర్తిగా అంకెల గారడీని తలపిస్తోందని మాజీమంత్రి షబ్బీర్ అలీ విమర్శించారు. వాస్తవాలకు విరుద్ధంగా భ్రమల్లో విహరించేలా రూపకల్పన చేశారని ఎద్దేవాచేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.2.32 లక్షల కోట్లకుపైగా ధనాన్ని ఖర్చుచేయాలని బడ్జెట్‌లో ప్రతిపాదించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలపై కొత్త పన్నుల రూపంలో రూ.30,225 కోట్ల మేర వడ్డించే అవకాశాలు ఉన్నాయన్నారు. గ్రాంట్‌ఇన్‌ఎయిడ్‌ రూపంలో రూ.38,669.46 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.49,300 కోట్లను ఏవిధంగా సమీకరిస్తుందో స్పష్టం చేయలేదని డిమాండ్ చేశారు. ఆదాయ వనరులు, రాబడి, వ్యయం వంటి విషయాలపై బడ్జెట్‌లో ఏమాత్రం స్పష్టత ఇవ్వలేదన్నారు.

ఒక సాధారణ కుటుంబ నిర్వహణకు న్యాయబద్ధమైన విధానాన్ని అమలు చేస్తుంటారని, అలాంటి పరిస్థితులు కూడా రాష్ట్ర ప్రభుత్వం చూపలేకపోతోందని విమర్శించారు. అధిక వడ్డీలతో భారీగా రుణాలు తీసుకోవడం ద్వారా ఏ ఇల్లు కూడా దీర్ఘకాలంగా మనుగడ సాగించదన్నారు. ఏ రాష్ట్రమూ తన ప్రజలను భారీ రుణ ఊబిలోకి నెట్టడం ద్వారా పురోగతి సాధించలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే తీసుకున్న రుణాల చెల్లింపు వాయిదాలు, వడ్డీల రూపంలో దాదాపు రూ.10వేల కోట్లు చెల్లిస్తోందన్నారు. బడ్జెట్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఊసెత్తలేదని విమర్శించారు. హైదరాబాద్‌లోనే లక్ష డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను నిర్మించామని మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తప్పుడు ప్రకటనలు చేశారని గుర్తుచేశారు. హైదరాబాద్‌ మహానగరానికి ఏం చేయబోయేది బడ్జెట్‌లో చెప్పలేదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం రూ.రెండువేల కోట్లు ఖర్చుచేస్తామని చెప్పి మోసం చేసిందని, అందులో కనీసం 50 శాతం కూడా ఖర్చుచేయలేదని విమర్శించారు. మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం కోసం చేసే కేటాయింపుల నిధులను వందశాతం ఖర్చుచేయాలని డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed